గణేష్ నిమజ్జనం తీర్పుపై హైకోర్టులో రివ్యూ పిటిషన్

ABN , First Publish Date - 2021-09-13T16:38:38+05:30 IST

హైదరాబాద్: గణేష్ నిమజ్జనంపై తీర్పుపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలయింది.

గణేష్ నిమజ్జనం తీర్పుపై హైకోర్టులో రివ్యూ పిటిషన్

హైదరాబాద్: గణేష్ నిమజ్జనంపై తీర్పుపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలయింది. తీర్పును పునఃపరిశీలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తీర్పులో ప్రధానంగా నాలుగు అంశాలు తొలగించాలని కోరారు. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని, ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని, సాగర్‌లో కృత్రిమ రంగులులేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని లోకేష్ కుమార్ కోరారు. హుస్సేన్ సాగర్‌లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని విజ్ఞప్తి చేశారు. ట్యాంక్ బండ్ వైపు అనుమతించక పోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందన్నారు. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యాం నిర్మాణానికి కొంత సమయం అవసరమన్నారు.


నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయని, విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవని లోకేష్ కుమార్ పేర్కొన్నారు. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమన్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామన్నారు. నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని, ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2021-09-13T16:38:38+05:30 IST