నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు

ABN , First Publish Date - 2020-05-26T15:21:51+05:30 IST

నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు

నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. వాయువ్య దిశ నుంచి వస్తున్న గాలులతో ఉదయం నుంచే వేడి వాతావరణం ఉంటోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఏపీలో చిత్తూరు జిల్లా గుడిపాలలో 44.44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. 


రోహిణికార్తిలో రోళ్లు పగులుతాయి అంటారు. దానికి తగ్గట్టుగానే మొదలైన రోజే మాడు పగులగొడుతోంది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు దీనికి వడగాల్పులు తోడయ్యాయి. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. వేడి గాలులు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, చిత్తూరు, విశాఖ, కర్నూలు, వరంగల్ వంటి నగరాలు లాక్‌డౌన్‌ను తలపిస్తున్నాయి. పలు నగరాల్లో దాదాపు కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఆదివారం నుంచే మొదలైన వడగాల్పులు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది.


సోమవారం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 46.5 డిగ్రీలు నమోదు కాగా, హైదరాబాద్‌లో గరిష్టంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఖమ్మం వాసులకు భానుడు చుక్కలు చూపుతున్నాడు. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవడంతో పాటు వడగాల్పులు వీస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. సోమవారం 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం గరిష్టంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

ఏపీలో కూడా ఎండ తీవ్రత కొనసాగుతోంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో వడగాల్పులకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లా గుడిపాలలో 44.4 డిగ్రీలు నమోదు అయ్యాయి. చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళవారం ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుంటాయి. కానీ ఇప్పుడు గాలి తన దిశను మార్చుకుని వాయువ్యం నుంచి వీస్తోంది. దీంతో తేమతగ్గి వేడి పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భల నుంచి ఈ వడగాలులు వీస్తున్నాయి. ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో సహా దేశవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు కొనసాగుతుంది. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 

Updated Date - 2020-05-26T15:21:51+05:30 IST