జలతత్త్వమే మహా లింగమై...

ABN , First Publish Date - 2021-04-02T06:03:52+05:30 IST

భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం... ఇవి పంచభూతాలు. సమస్త సృష్టికీ మూలాధారమైన ఈ పంచభూతాలు పరమేశ్వరుడి నుంచి ఉద్భవించాయని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. దీనికి ప్రతీకగా... అయిదు చోట్ల... పంచభూత లింగ రూపాల్లో మహా

జలతత్త్వమే మహా లింగమై...

భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం... ఇవి పంచభూతాలు. సమస్త సృష్టికీ మూలాధారమైన ఈ పంచభూతాలు పరమేశ్వరుడి నుంచి ఉద్భవించాయని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. దీనికి ప్రతీకగా... అయిదు చోట్ల... పంచభూత లింగ రూపాల్లో మహా శివుడు కొలువయ్యాడు. వాటిలో జలతత్త్వాన్ని ప్రతిఫలించే క్షేత్రం జంబుకేశ్వరం. దీన్నే ‘తిరువనైక్కావల్‌’ అని కూడా అంటారు. 


పార్వతీ దేవి ఈ ప్రాంతంలోని కావేరీ నది నీటితో... జల లింగాన్ని తయారు చేసి, పరమేశ్వరుణ్ణి పూజించేదట. ఆమె పూజలకు సంతుష్టుడైన శివుడు జల మహా లింగ రూపంలో స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. జంబుకేశ్వరంలోని ఆలయంలో  అఖిలాండేశ్వరి అమ్మవారిగా పార్వతీదేవి పూజలందుకుంటోంది. ఆలయ ఐతిహ్యం ప్రకారం... పూర్వం శంభుడు అనే ముని శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతనికి ప్రత్యక్షమై, ఆ ముని కోరిక మేరకు లింగ రూపంలో ఆ ప్రదేశంలో వెలిశాడు. తనను జంబూ (తెల్ల నేరేడు) వృక్ష రూపంలో శంభుడు సేవించుకొనే వరాన్ని ఇచ్చాడు. అలాగే, సాలె పురుగు, ఏనుగు ఈ క్షేత్రంలో శివుణ్ణి పూజించి సాయుజ్యాన్ని పొందాయన్నది మరో కథ. ఇది శ్రీకాళహస్తి గాథను పోలి ఉండడం విశేషం. 


కావేరీ నదీ తీరాన ఉన్న ఈ ఆలయం శిల్ప సంపదకు ఎంతో పేరు పొందింది. అయిదు ప్రాకారాలు, ఎత్తైన గోపురాలు, విశాలమైన మంటపాలు, ప్రధాన ఆలయం, ఉపాలయాల్లో అద్భుతమైన శిల్పాలు కనువిందు చేస్తాయి. తిరుచ్చి నగరానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో, వైష్ణవ దివ్య క్షేత్రమైన శ్రీరంగానికి శివార్లలో  జంబుకేశ్వరం ఉంది. ఇక్కడ ప్రధాన ఆలయంలో ఆది శంకరాచార్యులు  శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. చోళ రాజుల కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్టు ఆధారాలున్నాయి. జంబుకేశ్వర లింగం పానవట్టం నుంచి ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఆ జలాన్ని వస్త్రంతో తీసి, భక్తులకు తీర్థంగా ఇస్తారు. నిర్మలమైన చిత్తంతో, భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే ఎలాంటి ఇబ్బందులనైనా జంబుకేశ్వరుడు నీటితో కడిగినట్టు తొలగిస్తాడని భక్తుల విశ్వాసం.

Updated Date - 2021-04-02T06:03:52+05:30 IST