రామ భక్తురాలు శబరి వంశం మాది : ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్

ABN , First Publish Date - 2020-08-02T20:31:24+05:30 IST

అయోధ్య రామ జన్మ భూమిలో రామాలయం తన జీవిత కాలంలో నిర్మితమవుతుండటం

రామ భక్తురాలు శబరి వంశం మాది : ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్

పాట్నా : అయోధ్య రామ జన్మ భూమిలో రామాలయం తన జీవిత కాలంలో నిర్మితమవుతుండటం తన అదృష్టమని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఈ నెల 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామాలయానికి భూమి పూజ చేయబోతున్న సందర్భంగా పాశ్వాన్ ఆదివారం ట్విటర్ వేదికగా తన మనోభావాలను పంచుకున్నారు. తాను గొప్ప రామ భక్తురాలి వంశానికి చెందినవాడినని చెప్పారు. 


అనేక సంవత్సరాల తర్వాత అయోధ్యలో భగవాన్ శ్రీరాముని దేవాలయం నిర్మితమవుతోందని, రామాలయం నిర్మాణం కేవలం మానవులకే కాకుండా, అన్ని జీవులు, జంతువులు, పశువులు, పక్షులకు సైతం సంతోషకరమని, ఆత్మ సంతృప్తి కలిగించే విషయమని పేర్కొన్నారు. శ్రీరాముడిని దేశం, జాతి వంటి చట్రాల్లో బంధించడం సాధ్యం కాదన్నారు. శ్రీరాముడు అన్ని రకాల జీవులు, జంతువులకు దారి చూపే దేవుడని పేర్కొన్నారు. 


తాను చాలా అదృష్టవంతుడినని, తాను జీవించి ఉన్న కాలంలోనే రామాలయం నిర్మాణం జరుగుతోందని చెప్పారు. తాను గొప్ప రామ భక్తురాలు శబరి వంశస్థుడినన్నారు. నిమ్నవర్గాల నుంచి వచ్చిన మతంగ మహర్షి శిష్యురాలు శబరి అని తెలిపారు. మాత శబరికి అనేక సద్గుణాలు ఉన్నాయని, అయినా ఆమెకు అహంకారం లేదని చెప్పారు. మాత శబరికి అహంకారం లేకపోవడం వల్లే ఆమె స్వయంగా కొరికి, ఇచ్చిన పండ్లను శ్రీరాముడు స్వీకరించాడన్నారు. శ్రీరాముడు శబరిని తన తల్లి కౌసల్యతో సమానమని చెప్పారని అన్నారు.  అటువంటి శబరి వంశస్తుఢినైన తాను తన కళ్ళ ఎదుట రామాలయం నిర్మాణం జరుగుతుండటాన్ని చూడటం తన అదృష్టమని చెప్పారు. 



Updated Date - 2020-08-02T20:31:24+05:30 IST