వెల్లూరుకొచ్చాను, చాలా సంతోషంగా ఉంది : రామ్‌నాథ్ కోవింద్

ABN , First Publish Date - 2021-03-10T20:31:45+05:30 IST

భారత స్వాతంత్ర్య సంగ్రామానికి తొలినాళ్ళలో సూచనలు పంపిన వెల్లూరుకు

వెల్లూరుకొచ్చాను, చాలా సంతోషంగా ఉంది : రామ్‌నాథ్ కోవింద్

వెల్లూరు : భారత స్వాతంత్ర్య సంగ్రామానికి తొలినాళ్ళలో సూచనలు పంపిన వెల్లూరుకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. స్వాతంత్ర్య పోరాటానికి తొలి సంకేతాలు పంపినవాటిలో 1806లో జరిగిన వెల్లూరు సిపాయిల తిరుగుబాటు ఒకటి అని తెలిపారు. తిరువళ్ళువార్ విశ్వవిద్యాలయం 16వ వార్షిక స్నాతకోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. 


రామ్‌నాథ్ కోవింద్ తమిళంలో మాట్లాడుతూ, తిరువళ్ళువార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులను కలవడం గర్వకారణమని చెప్పారు. భక్తి భావం నిండిన కవుల్లో ఒకరైన తిరువళ్ళువార్ పేరును ఈ విశ్వవిద్యాలయానికి  పెట్టడం ప్రశంసనీయమన్నారు. తిరువళ్ళువార్ బోధనలను అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. తిరువళ్ళువార్ రాసిన కురళ్ గీతాలు పాఠ్యాంశాల్లోనూ, జీవితాల్లోనూ భాగం కావాలన్నారు. తమిళనాడు వ్యవసాయంలో ఎంత సారవంతమైనదో, సాహిత్య రంగంలో కూడా అంతే సారవంతమైనదని కొనియాడారు. 


65 శాతం మంది విద్యార్థినులే...

తిరువళ్ళువార్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నవారిలో 65 శాతం మంది విద్యార్థినులేనని, ఈ ఏడాది స్వర్ణ పతకాలు సాధించిన 66 మందిలో 55 మంది మహిళలే కావడం హర్షణీయమని రాష్ట్రపతి చెప్పారు. దీనినిబట్టి మన దేశానికి మంచి భవిష్యత్తు ఉందని స్పష్టమవుతోందన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో విద్యావంతులు కావడం వారి భవిష్యత్తుకు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి రక్షణ లభిస్తుందన్నారు. తమిళం, ఇంగ్లిష్, ఫిజిక్స్, కామర్స్, జువాలజీ, బోటనీ తదితర విభాగాల్లో అగ్ర శ్రేణి ర్యాంకులు సాధించిన 10 మంది విద్యార్థులకు పురస్కారాలను ప్రదానం చేశారు. 


వ్యక్తిగత వికాసానికి విద్య

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ), 2020 గురించి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ, ఎన్ఈపీని చక్కని ప్రణాళికతో రూపొందించారని చెప్పారు. వ్యక్తిగత వికాసంలో భాగంగా విద్యాభ్యాసం సాగే విధంగా దూరదృష్టితో దీనిని రూపొందించినట్లు తెలిపారు. ఈ విద్యా విధానం సామాజిక అవసరాలను నెరవేర్చుతుందని తెలిపారు. ఉన్నత విద్యా వ్యవస్థ సమానత్వం, నైపుణ్యం, సాధికారతలకు దోహదపడాలనేదే దీని లక్ష్యమని చెప్పారు. 


Updated Date - 2021-03-10T20:31:45+05:30 IST