కాంగ్రెస్‌కు సీనియర్‌ నేత ఇబ్రహీం గుడ్‌బై

ABN , First Publish Date - 2022-01-28T01:40:09+05:30 IST

కాంగ్రెస్‌కు సీనియర్‌ నేత ఇబ్రహీం గుడ్‌బై

కాంగ్రెస్‌కు సీనియర్‌ నేత ఇబ్రహీం గుడ్‌బై

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇక కాంగ్రెస్‌తో సంబంధాలు ముగిశాయని ఆయన గురువారం ప్రకటించారు. ప్రస్తుతం ఎటువంటి నిర్ణయం తీసుకునేందుకైనా తాను స్వతంత్రుడనని అన్నారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు అత్యంత ఆప్తుడిగా ముద్రపడిన ఇబ్రహీం పార్టీని వీడేందుకు ఏడాదిగా ప్రయత్నిస్తున్నారు. విధానపరిషత్‌లో ప్రతిపక్షనేత హోదా ఖాళీ కావడంతో ఆ స్థానానికి తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ స్థానానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం పార్టీ సీనియర్‌ నేత బీకే హరిప్రసాద్‌కు బుధవారం ఖరారు చేసింది. ఆ వెంటనే ఇబ్రహీం రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. జేడీఎస్‌లో చేరే విషయం త్వరలోనే చెబుతానని అన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి తమపై అభిమానం తగ్గిందని, అటువంటి చోట కొనసాగినా ప్రయోజనం ఉండదని అన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు బీకే హరిప్రసాద్‌ పట్ల అభిమానం ఉందని, వారిద్దరిదీ ఒకే మాట అని వ్యాఖ్యానించారు. 1996లో రాజ్యసభ టికెట్‌ను తనకు ఖరారు చేసి రద్దు చేశారని, ఆ తర్వాత మరోసారి అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జేడీఎస్‌ నేత కుమారస్వామితోపాటు కాంగ్రెస్‌ నేతలు కొందరు ఫోన్‌ చేశారని వెల్లడించారు. త్వరలోనే మరిన్ని నిర్ణయాలు తీసుకుంటానని అన్నారు.

Updated Date - 2022-01-28T01:40:09+05:30 IST