టీ20 వరల్డ్కప్.. హైదరాబాద్కూ ఆతిథ్య భాగ్యం
ABN , First Publish Date - 2021-04-18T05:46:21+05:30 IST
ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ అవకాశం దక్కలేదని బాధపడుతున్న తెలుగు ప్రజలకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. పురుషుల టీ20 వరల్డ్కప్నకు ఆతిథ్యాన్నిచ్చే భాగ్యం హైదరాబాద్కు కల్పించింది...
- టీ20 వరల్డ్కప్ తొమ్మిది వేదికల్లో హైదరాబాద్
- అహ్మదాబాద్లో ఫైనల్
- పాక్ జట్టు వీసాలకు ఓకే
న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ అవకాశం దక్కలేదని బాధపడుతున్న తెలుగు ప్రజలకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. పురుషుల టీ20 వరల్డ్కప్నకు ఆతిథ్యాన్నిచ్చే భాగ్యం హైదరాబాద్కు కల్పించింది. ఈ అక్టోబరు-నవంబరులో జరిగే మెగా టోర్నీకి మొత్తం 9 వేదికలను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఖరారు చేసింది. అందులో హైదరాబాద్తోపాటు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, ధర్మశాల, అహ్మదాబాద్, లఖ్నవ్ ఉన్నాయి. ఫైనల్ అహ్మదాబాద్లో జరుగుతుంది. ‘ఈమేరకు 9 రాష్ర్టాల క్రికెట్ సంఘాలకు సమాచారం ఇచ్చాం. కొవిడ్ను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని సూచించాం. అయితే అక్టోబరు-నవంబరులో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయలేం. అయినా టోర్నమెంట్కు ఏర్పాట్లు కొనసాగుతాయి’ అని బోర్డు అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. వాస్తవంగా 6వేదికలనే ఎంపిక చేయాలని బీసీసీఐ భావించింది. కానీ ఆతిథ్యం కోసం పలు రాష్ట్రాలు బోర్డును అభ్యర్థించాయి. దాంతో ఐసీసీతో చర్చించిన బీసీసీఐ..వేదికల సంఖ్యను తొమ్మిదికి పెంచింది. 2016 ప్రపంచకప్ భారత్లోని 7 నగరాల్లో జరిగింది. అప్పటి వేదికల్లో నాగపూర్, మొహాలీని తప్పించారు. ఈసారి హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, లఖ్నవ్ను చేర్చారు. ఇక..టోర్నీ నాటికి దేశంలో కొవిడ్ పరిస్థితి మెరుగుపడకపోతే ‘ప్లాన్-బి’ని కూడా బీసీసీఐ సిద్ధం చేసినట్టు సమాచారం.
పాక్ క్రికెటర్లకు భారత్ వీసాలు!
టీ20 ప్రపంచక్పలో పాకిస్థాన్ ప్రాతినిథ్యానికి మార్గం సుగమమైంది. ఆ దేశ క్రికెటర్లకు వీసాలు మంజూరు చేసేందుకు భారత ప్రభుత్వం అనుమతించినట్టు బీసీసీఐ పేర్కొంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి బోర్డు కార్యదర్శి జై షా తెలిపారు. భారత ప్రభుత్వం వీసాలపై తమకు హామీ ఇవ్వాలంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గతంలోనే ఐసీసీని డిమాండ్ చేసింది.