ఓటీఎస్ కట్టకపోతే ఇల్లు స్వాధీనమంటా..!
ABN , First Publish Date - 2021-12-08T04:22:04+05:30 IST
తనకున్న చిన్నపాటి జాగాకి ఓటీఎస్ కట్టకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటాం అని సచివాలయాలోళ్లు బెదిరిస్తున్నారయ్యా అని ఓ దళిత వృద్ధురాలు టీడీపీ నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.
వృద్ధురాలి ఆవేదన
కనిగిరి, డిసెంబరు 7 : తనకున్న చిన్నపాటి జాగాకి ఓటీఎస్ కట్టకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటాం అని సచివాలయాలోళ్లు బెదిరిస్తున్నారయ్యా అని ఓ దళిత వృద్ధురాలు టీడీపీ నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాలతో పార్టీ నగర అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసలురెడ్డి ఆధ్యర్యంలో చింతలపాలెం ఎస్సీపాలెంలో జరిగిన గౌరవ సభలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన కరాటపు కొండమ్మకు 30 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇచ్చింది. ఏ ఆదరణ, ఆదాయం లేని తాను ఓటీఎస్ చెల్లించేందుకు నానా అవస్థలు పడ్డానని తెలిపింది. ఇల్లు స్వాధీనం చేసుకుంటామని చెప్పటంతో ఉన్నగూడు పోతుందని తెలిసిన నలుగురు వద్ద బదులు తీసుకుని ఓటీఎస్ నగదు రూ4,800 చెల్లించానని వాపోయింది.
ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లను ప్రతిఒక్కరూ అడ్డుకోవాలన్నారు. మంగళవారం రాత్రి పట్టణ సమీపంలోని 4, 5 వార్డుల్లో జరిగిన గౌరవసభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఇల్లు రిజిస్ర్టేషన్లు చేయించి పత్రాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రోషన్సంధాని, ఫిరోజ్, కాసుల శ్రీరాములుయాదవ్, రాజారావు, మోజేస్, కరాటపు స్వప్న, దానియేలు తదితరులు పాల్గొన్నారు.