పరిశ్రమను ఏర్పాటు చేస్తే అడ్డుకుంటాం
ABN , First Publish Date - 2020-05-19T10:04:29+05:30 IST
జెన్కో గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ కోసం తీసుకున్న తమ భూముల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని మండలంలోని
నేదునూర్ గ్రామ రైతులు
తిమ్మాపూర్, మే 18: జెన్కో గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ కోసం తీసుకున్న తమ భూముల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని మండలంలోని నేదునూర్ రైతులు హెచ్చరించారు. సోమవారం గ్రామంలో ప్లాంట్ కోసం భూమి ఇచ్చిన రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేదునూర్లో గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం 436 ఎకరాలు ఇచ్చామన్నారు.
ఆ సమయంలో పరిహారంతోపాటు ఇంటికి ఒక ఉద్యోగం, ఒక సంవత్సర పని దినాలు నష్టపోకుండా డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు పరిహారం డబ్బులు తప్ప ఏ హామీ నెరవేర్చలేదన్నారు. ఇప్పడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామంటున్నారని, తమను ఎవరు పట్టించుకుంటారని వారు ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే పరిశ్రమ ఏర్పాటు గురించి ఆలోచించాలన్నారు.