ప్రధాని దిగిరాకపోతే భారత్‌ బంద్‌: వామపక్షాలు

ABN , First Publish Date - 2021-06-19T09:09:16+05:30 IST

పెట్రోలు, డీజిల్‌ ధరలను తక్షణమే తగ్గించాలని, ఈ విషయంలో ప్రధాని మోదీ మెట్టు దిగకపోతే భారత్‌ బంద్‌ నిర్వహిస్తామని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ హెచ్చరించారు

ప్రధాని దిగిరాకపోతే భారత్‌ బంద్‌: వామపక్షాలు

అమరావతి/విజయవాడ, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): పెట్రోలు, డీజిల్‌ ధరలను తక్షణమే తగ్గించాలని, ఈ విషయంలో ప్రధాని మోదీ మెట్టు దిగకపోతే భారత్‌ బంద్‌ నిర్వహిస్తామని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ హెచ్చరించారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వామపక్షాలు విజయవాడ దాసరి భవన్‌ వద్ద శుక్రవారం ధర్నా చేశాయి. ఈ ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ 22సార్లు పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచారన్నారు. వంట నూనె ధరల పెంపుదలలో మోదీ డబుల్‌ సెంచరీ కొట్టారని ఆరోపించారు. విపరీతంగా ధరలు పెరగడంతో రవాణా ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరల పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాలతోనే రాష్ట్రంలో ఆస్తి పన్నును పెంచడంతోపాటు చెత్తపై పన్ను వేస్తున్నారని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు చేపడుతున్న మోదీకి వ్యతిరేకంగా భారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, కేద్రం పన్నుల భారంతో సతమతం చేస్తోందని ధ్వజమెత్తారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు ద్వారా ఏడాదికి రూ.1.45 లక్షల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. నాడు బ్రిటీష్‌ ప్రభుత్వం తరహాలోనే మోదీ పన్నులపై పన్నులు విధిస్తున్నారన్నారు. ప్రజాసమస్యలపై తాము పోరాటం చేస్తుంటే పోలీసులు అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - 2021-06-19T09:09:16+05:30 IST