టీఆర్ఎస్ గెలిస్తే..రెడ్డి సామాజిక వర్గానికి మేయర్ పదవి?
ABN , First Publish Date - 2020-12-03T08:05:20+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో గెలిస్తే మేయర్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని టీఆర్ఎస్ అధిష్ఠానం సూత్రప్రాయంగా
‘గ్రేటర్’ విజయంపై అధిష్ఠానం ధీమా
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో గెలిస్తే మేయర్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని టీఆర్ఎస్ అధిష్ఠానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ శాతంపై బుధవారం ఉదయానికి స్పష్టత రావటం, పోలింగ్ సరళిపై పూర్తి వివరాలు అందటంతో మంచి మెజార్టీతో విజయం సాధిస్తామనే ధీమాను టీఆర్ఎస్ అధిష్ఠానం ముఖ్యులు వ్యక్తంచేశారు.
మరోసారి ఎక్స్ అఫీషియో ఓట్ల అవసరం లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కించుకుంటామనే విశ్వాసాన్ని వారు వెలిబుచ్చుతున్నారు. ఇదివరకు మేయర్ పీఠం..బీసీ జనరల్కు రిజర్వ్ కావటంతో ఆ పదవి బొంతు రామ్మోహన్కు దక్కింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంది. ఆ తర్వాతనే మొదట ఈ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచిన వారి ప్రమాణ స్వీకారం, తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనున్నాయి.
టీఆర్ఎ్సకి ఎక్కువ ఎక్స్ అఫీషియో ఓట్లు ఉండటంతోపాటు, మెజార్టీ సీట్లు ఖాయమని భావిస్తున్న ఆ పార్టీ వర్గాల్లో మేయర్ పదవి భర్తీపై చర్చ జరుగుతోంది. ఈసారి మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావటంతో, అందుకు ఓసీ మహిళలే కాకుండా, బీసీ-ఎస్సీ-ఎస్టీ మహిళలు కూడా అర్హులే. అయితే పార్టీ అధిష్ఠానం బీసీ-ఎస్సీ-ఎస్టీ మహిళకు మేయర్ పదవి ఇవ్వటానికి సుముఖంగా లేదనే ప్రచారం జరుగుతోంది.
ఓసీల్లోనూ బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళకు పార్టీ తరపున మేయర్ పీఠం దక్కుతుందని చెబుతున్నారు. దీనిపై ఈనెల 4న గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసి, గెలిచే జనరల్ మహిళ కేటగిరి కార్పొరేటర్లు ఎవరు అనేది తేలాక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తుది నిర్ణయానికి అనుగుణంగానే పార్టీ తరఫున మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిత్వాలు ఖరారు కానున్నాయి.