తెలంగాణ నుంచి అక్రమ మద్యం

ABN , First Publish Date - 2020-06-04T11:18:32+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు జరిపిన దాడులు, తనిఖీల్లో తెలంగాణ నుంచి అక్ర మంగా తరలిస్తున్న మద్యంతో పాటు సారాని స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ నుంచి అక్రమ మద్యం

తనిఖీల్లో చిక్కిన అక్రమ రవాణా దారులు


ఏలూరు క్రైం/చింతలపూడి/జంగారెడ్డిగూడెం/లింగపాలెం/టి.నరసాపురం/ గణపవరం/జీలుగుమిల్లి/కొవ్వూరు/పెరవలి, జూన్‌ 3 : జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు జరిపిన దాడులు, తనిఖీల్లో  తెలంగాణ నుంచి అక్ర మంగా తరలిస్తున్న మద్యంతో పాటు సారాని స్వాధీనం చేసుకున్నారు. బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నిందితులను అరెస్టు చేశారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొస్తున్న ఇద్దరు యువకులను ఏలూరు టూటౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆరెస్ట్‌ చేశారని డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ బుధవారం విలేక రుల సమావేశంలో తెలిపారు.  మొం డికోడుకు చెంది షేక్‌ మస్తాన్‌ వలీ (36) అదే గ్రామంలో రాజుల పేటకు చెందిన షేక్‌ బాజీ సాహెబ్‌ (20)  కలిసి ఏలూరు నుంచి  తెలంగాణ రాష్ట్రం ఖమ్మం వెళ్లారు. ఈనెల 2వ తేదీన వారు తిరిగి వచ్చేటప్పుడు అక్కడ వివిధ బ్రాండ్లకు చెందిన 168  మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి ఖాళీ ఐషర్‌ వ్యాన్‌లో తీసుకొస్తూ అశోక్‌ నగర్‌ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలో పట్టుబడ్డారు. 168 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని మస్తాన్‌ వలీ, బాజీ సాహెబ్‌లను అరెస్ట్‌ చేశారు. రూ.13, 470 నగదు, వాహనాన్ని సీజ్‌ చేశామన్నారు.  


తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.లక్షా 25 వేల విలువైన 204 సీసాల నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యాన్ని చింతలపూడి మండలం రాఘవా పురం వద్ద పోలీసులు పట్టుకున్నారు. చింతలపూడి సీఐ పి.రాజేశ్‌ తెలిపిన వివ రాల ప్రకారం ఏలూరు శనివారపుపేట ప్రభుత్వ పాఠశాలలో మాస్టారుగా పని చేస్తున్న బాణావత్‌ సంజయ్‌ నాయక్‌ తెలంగాణలోని సత్తుపల్లి నుంచి వాహ నంలో వీటిని తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో మొబైల్‌ టీమ్‌ వెళ్లి రాఘవాపురంలో పట్టుకున్నారన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఆయన వెంట చింతలపూడి ఎస్‌ఐ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.  


మద్యంను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు జంగారెడ్డిగూడెం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో సీఐ సీహెచ్‌ అజయ్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. సర్కిల్‌ కార్యాలయం వద్ద బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. తెలంగాణ నుంచి ఏపీలోకి ఏలూరుకు చెందిన వల్లూరి వెంకట రమణ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై 55 మద్యం సీసాలను తీసుకొస్తుండగా తాటియాకులగూడెం చెక్‌పోస్టు వద్ద నిందితుడిని, మద్యం సీసాలను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ఒకరిని అరె స్టు చేసి కేసు నమోదు చేశామన్నారు.


ఏలూరు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం.జయ రాజ్‌ పర్యవేక్షణలో ధర్మాజీగూడెం పోలీస్‌ సిబ్బంది లింగపాలెం మండలం యడ వల్లిలోని తమ్మిలేరు ప్రాంతంలో దాడి చేసి సారా తయారీకి ఉపయోగించే 1800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ధర్మాజీగూడెంలోని భోగోలు అడ్డ రోడ్డు వద్ద మోటారు సైకిల్‌పై 20 లీటర్ల సారాని తరలిస్తుండగా పట్టుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఎక్సైజ్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు.


టి.నరసాపురం మండలం రాజుపోతేపల్లిలో లింగపాలెం మండలం కె.గోక వరానికి చెందిన ఇద్దరు  సారాను తరలిస్తుండగా అదుపులోకి తీసుకుని పది లీటర్ల సారా, మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ మహేశ్వరరావు తెలిపారు.  


గణపవరం మండలం జల్లికొమ్మరలో నిసిగరే శ్రీను ఇంటిపై దాడి చేసి 26 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వీరబా బు తెలిపారు.


కొవ్వూరులో ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసి ఐదు లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామని కొవ్వూరు అర్బన్‌ సీఐ ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. పట్టణ ఎస్‌ఐ కె. వెంకట రమణ దాడి చేసి నందమూరు రోడ్డులో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన మెరుపురెడ్డి ప్రసాద్‌ అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించారు. పెరవలి మండలం కానూరులో సారా అమ్ముతున్న నడిపల్లికి చెందిన ఆరేపల్లి వెంకటేశ్వరరావును అరెస్ట్‌ చేసి ఐదు లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఈబీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, సీఐ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. కొవ్వూరులో వేములూరుకు చెందిన కాసాని గాలి అనే వ్యక్తిని అరెస్టు చేసి 5 లీటర్ల  నాటు సారా, హోండా మోపెడ్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.


దేవరపల్లి మండలం లక్ష్మీపురంలో 600 లీటర్ల  బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. యర్నగూడెంలో 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి కడలి రామకృష్ణను అరెస్టు చేశామన్నారు. సుబ్బరాయపురంలో చెల్లింకి శ్రీనివాసరావును అరెస్టు చేసి 25 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. అనుమతులు  లేకుండా  పశివేదల శివారులో ఈనెల 2న రాత్రి సమయంలో బెవర రామారావు అనే వ్యక్తి మద్యం విక్రయిస్తుండగా 24 క్వార్టర్‌ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ కె. రామకృష్ణ తెలిపారు. 

Updated Date - 2020-06-04T11:18:32+05:30 IST