అందరికీ ఒకే పింఛన్’ అమలు చేయండి
ABN , First Publish Date - 2020-11-28T09:48:16+05:30 IST
విద్యుత్ ఉద్యోగులకు వేర్వేరు పింఛను పథకాలు అమలవుతున్నాయని, వీటిని ప్రక్షాళన చేసి, అందరికీ ఒకే పింఛను విధానాన్ని అమలు చేయాలని ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం(1104) నేతల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మంత్రి బాలినేనికి ఉద్యోగ సంఘం వినతి
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): విద్యుత్ ఉద్యోగులకు వేర్వేరు పింఛను పథకాలు అమలవుతున్నాయని, వీటిని ప్రక్షాళన చేసి, అందరికీ ఒకే పింఛను విధానాన్ని అమలు చేయాలని ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం(1104) నేతల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు పి. చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి వీఎ్సఆర్కే గణపతి, వర్కింగ్ అధ్యక్షుడు ఎం. జగదీశ్వర్, సహాయ ప్రధాన కార్యదర్శి ఎస్. కృష్ణయ్య తదితరులు శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
1999 సంవత్సరానికి ముందు చేరిన వారికి ఒక పింఛను విధానం.. ఆ తర్వాత చేరిన వారికి మరో విధానం అమల్లో ఉన్నాయని, ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేర్వేరు పథకాల అమలు వాంఛనీయం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీపీఎఫ్ వర్తింప చేయాలని కోరారు. అదేవిధంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలు తక్కువగా ఉన్నాయని, కనీస వేతన చట్టం కూడా అమలు కావడం లేదని తెలిపారు. తెలంగాణలో మాదిరిగా వారికి విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలు చెల్లించే ఏర్పాటు చేయాలని, అవకాశం ఉంటే క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల్లో ఏర్పడిన ఖాళీలను అవే సబ్ స్టేషన్లలో పనిచేస్తున్న వాచ్మెన్లు, ఇతర సిబ్బందితో భర్తీ చేయాలని కోరారు. గ్రామ సచివాలయాల్లో విద్యుత్ సహాయకుల పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని, ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించాలని, కార్మిక సంఘం కోసం అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కాగా, ఆయా అంశాలను పరిశీలిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.