రైల్వే ఆస్పత్రిలో కిడ్నీ రోగులకు మెరుగైన చికిత్స

ABN , First Publish Date - 2020-06-01T10:53:41+05:30 IST

లాలాగూడ రైల్వే ఆస్పత్రి గడిచిన నాలుగేళ్లలో అధునాతన డయాలసిస్‌ యూనిట్‌తో.... మెరుగైన చికిత్స అందిస్తోంది.

రైల్వే ఆస్పత్రిలో కిడ్నీ రోగులకు మెరుగైన చికిత్స

సికింద్రాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి):  లాలాగూడ రైల్వే ఆస్పత్రి  గడిచిన నాలుగేళ్లలో అధునాతన డయాలసిస్‌ యూనిట్‌తో.... మెరుగైన చికిత్స అందిస్తోంది. లాలాగూడలోని దక్షిణమధ్యరైల్వే కేంద్రీయ ఆస్పత్రిలో ఈ యూనిట్‌ 2016-17వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 50వేల మంది రోగులకు హీమో డయాలసిస్‌ అందించి రికార్డు సృష్టించింది. కొవిడ్‌ వైరస్‌ విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో సైతం 2,791 మంది కిడ్నీ రోగులకు హీమో డయాలసిస్‌ అందించడం గమనార్హం.


15 డయాలసిస్‌ యంత్రాలు కలిగిన ఈ యూనిట్‌ నిత్యం సర్వీసులో ఉన్న 130 మంది ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వారి కుటుంబాలకు డయాలసిస్‌ సేవలు అందిస్తోంది. రైల్వే సొంతంగా నిర్వహించే ఈ డయాలసిస్‌ యూనిట్‌ వల్ల యేటా ఆస్పత్రికి రూ.3 కోట్ల ఖర్చు ఆదా అవుతోంది. దక్షిణమధ్యరైల్వే అదనపు చీఫ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.వి.బి.కె.సాయి ఈ డయాలసిస్‌ యూనిట్‌కు నేతృత్వం వహిస్తుండగా విజిటింగ్‌ నెఫ్రాలజి్‌స్టగా డాక్టర్‌ పవన్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు. లాలాగూడ రైల్వే ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ సి.కె.వెంకటేశ్వర్లు సేవలందిస్తున్నారు. ఈ యూనిట్‌తో మెరుగైన వైద్యసేవలందిస్తున్నందుకు వైద్యులను, ఇతర సిబ్బందిని దక్షిణమధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - 2020-06-01T10:53:41+05:30 IST