పేదలకు డబ్బులు ఇవ్వలేం.. లాక్ డౌన్ ఎత్తేస్తాం: పాక్ ప్రధాని
ABN , First Publish Date - 2020-06-03T00:46:32+05:30 IST
పాకిస్థాన్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ లాక్ డౌన్ ఎత్తేయబోతున్నామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ లాక్ డౌన్ ఎత్తేయబోతున్నామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించారు. కరోనాతో కలసి జివించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విన్నవించారు. ఆర్థిక స్థితి కుప్పకూలే స్తితికి చేరుకోవడంతో పాక్ ఇప్పటికే అనేక ఆంక్షలకు ముగింపు పలికింది. త్వరలో పర్యటక రంగాన్ని కూడా పునఃప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. ఒక్క లాహోర్ నగరంలోనే దాదాపు 7 లక్షల కరోనా కేసులు ఉంటాయంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు వెలువడ్డ కొద్ది సేపటికే ప్రధాని ఈ ప్రకటన చేశారు. ఇతర దేశాల వలె పాక్ లాక్ డౌన్ను సుదీర్ఘకాలం భరించలేదని టీవీ ప్రసంగంలో ప్రజలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. 13 నుంచి 15 కోట్ల మంది పేదలు లాక్ డౌన్ కారణంగా ప్రభావితమయ్యారని వారందరి చేతుల్లో డబ్బులు ఉంచే శక్తి ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. పేదలకు ఇంకెన్నాళ్లు ధన సహాయం చేయగలం. వారికి డబ్బూ ఇస్తూ పోయేందుకు మన ఆర్థిక పరిస్తితి అంగీకరించదు. అని ఆయన వ్యాఖ్యానించారు. లాక్ డౌన్లు కరోనాను అడ్డుకోలేవని కూడా ఆయన చెప్పుకొచ్చారు.