ఎన్నికల వేళ.. 200 కేజీల జిలేబీలు, 1050 సమోసాల సీజ్!
ABN , First Publish Date - 2021-04-11T22:04:13+05:30 IST
ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం, డబ్బులు పంపిణీ చేయడం గురించి చూస్తున్నాం
ఉన్నావో: ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం, డబ్బులు పంపిణీ చేయడం గురించి చూస్తున్నాం, వింటున్నాం. కానీ ఈ జిలేబీలు, సమోసాలు ఏంటి మరీ విచిత్రం కాకపోతేనూ.. అనుకోకండి. ఇది నిజమే. పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్ధం చేసిన వీటిని పోలీసులు సీజ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావోలో జరిగిందీ ఘటన. హసన్గంజ్లో ఓటర్లకు పంచి పెట్టేందుకు ఓ అభ్యర్థి పెద్ద ఎత్తున జిలేబీలు, సమోసాలు సిద్ధం చేశాడు.
ప్రత్యర్థులు ఊరుకుంటారా? ఎవరో ఈ సమచారాన్ని పోలీసులకు అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగి సదరు అభ్యర్థి ఇంట్లో వాలిపోయారు. రెండు క్వింటాళ్ల జిలేబీలు, 1050 సమోసాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, ఎల్పీజీ సిలిండర్లు, పిండి, నెయ్యితోపాటు సమోసా, జిలేబీలు తయారీలో ఉపయోగించే ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన, ఎన్నికల నియమాళిని ఉల్లంఘించడం వంటి కేసులు నమోదు చేసి 10 మందిని అరెస్ట్ చేశారు .
ఉత్తరప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జరగనున్నాయి. ఈ నెల 15న తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. చివరి విడత ఈ నెల 29న జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.