కరోనా కష్టకాలంలో విద్యుత్ చార్జీల భారం
ABN , First Publish Date - 2021-06-15T04:53:08+05:30 IST
కరోనా కష్టకాలంలో జగన్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపుతో మరో భారం మోపిందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి అన్నారు.
టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి చేజర్ల
కోవూరు, జూన్14: కరోనా కష్టకాలంలో జగన్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపుతో మరో భారం మోపిందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2నెలల బిల్లులు ఒకేసారి తీయడంతో స్లాబులు మారి బిల్లులు రెట్టింపయ్యాయన్నారు. గత కొవిడ్ సమయంలో చేసిన విఽధంగా రెండు నెలల రీడింగ్ను విభజించి సరాసరిచేసి బిల్లులివ్వాలన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో గృహాలకు ఏడాది మొత్తం మీద వాడిన విద్యుత్ ఆధారంగా స్లాబులు వర్గీకరించి సంవత్సరం మొత్తం ఆ ప్రకారం బిల్లులిచ్చేవారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఏ నెలకానెల విద్యుత్ వినియోగంతో స్లాబులు నిర్ణయించి చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది లాక్డౌన్ సమయంలో చేసిన విధంగా విద్యుత్ వినియోగంపై చార్జీలు వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.