ప్రతీ ఇంట్లో..మూలుగుడే
ABN , First Publish Date - 2022-01-26T06:15:32+05:30 IST
పాలమూరు జిల్లావ్యాప్తంగా మొత్తం 750 బృందాలతో ఫీవర్ సర్వే చేపట్టారు. ఈ మేరకు ఐదు రోజుల పాటు పాలమూరు జిల్లాలో 2,05,996 ఇండ్లను సర్వే చేశారు. పాలమూరు జిల్లావ్యాప్తంగా మొత్తం 750 బృందాలతో ఫీవర్ సర్వే చేపట్టారు. ఈ మేరకు ఐదు రోజుల పాటు పాలమూరు జిల్లాలో 2,05,996 ఇండ్లను సర్వే చేశారు.
- ఫీవర్ సర్వేలో 8,098 మంది జ్వర పీడితుల గుర్తింపు
- లక్షణాలున్న వారిని పరీక్షిస్తే ప్రతీ 10 మందిలో 8 మందికి పాజిటివ్
- సొంత వైద్యం చేసుకుంటున్న జనం
మహబూబ్నగర్ (వైద్యవిభాగం)/గద్వాలక్రైం/కందనూలు/నారాయణ పేట క్రైం, జనవరి 25 : పాలమూరు జిల్లావ్యాప్తంగా మొత్తం 750 బృందాలతో ఫీవర్ సర్వే చేపట్టారు. ఈ మేరకు ఐదు రోజుల పాటు పాలమూరు జిల్లాలో 2,05,996 ఇండ్లను సర్వే చేశారు. ఈ సర్వేలో మొత్తం 8,098 మంది కరోనా లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు. వారందరికి అక్కడే మందులతో కూడిన ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేశారు. వైరస్ తీవ్రత గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా కనిపించింది. జిల్లావ్యాప్తంగా 8వేల మంది జ్వరపీడితులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో కరోనా పరీక్షలు చేస్తే దాదాపు 5వేల మంది పాజిటివ్ రోగులు ఉండొచ్చనే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఫీవర్ సర్వే మంగళ వారం నాటికి ముగిసింది. పాలమూరు జిల్లాలోని 2,05,996 ఇండ్లను సర్వే చేశారు.
ఇదిలా ఉండగా చాలా మంది పరీక్షలు చేసుకొని పాజిటివ్ వచ్చినా దర్జాగా బయట తిరుగుతున్నారు. మరికొంతమంది లక్షణాలు సైతం చెప్పకుండా తమ సొంత వైద్యం చేసుకుంటున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది.వచ్చిన కేసుల్లో దాదాపు 5వేల వరకు పట్టణ ప్రాంతాలలో ఉండడం, అది కూడా మహబూబ్నగర్ పట్టణంలోనే 3వేల వరకు ఉండడం చూస్తే అర్బన్ ప్రాంతాల్లో ఏ మేరకు వైరస్ వ్యాపించిందో అర్థమవుతుంది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 606 బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. మంగళవారం ఒక్కరోజే 31,326 ఇండ్లను పరిశీలించి 959 మంది జ్వరపీడితులకు మెడికల్ కిట్లను అందజేశారు. ఇప్పటివరకు మొత్తం 1,52,976 ఇండ్లను సర్వే చేశారు. అందులో అనుమానిత కొవిడ్ కేసులను 4802 మందిని గుర్తించి వారికి కొవిడ్ కిట్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
నారాయణపేట జిల్లాలో ఇంటింటి ఫీవర్ సర్వేను వైద్య ఆరోగ్యశాఖ 1,41,397 ఇండ్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సర్వేలో మొత్తం 600 బృందాలు పాల్గొన్నాయి. ప్రతీ రోజు ఒక బృందం 25 నుంచి 30 ఇండ్లను సర్వే చేశారు. తాజాగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా 17,745 ఇండ్లను సర్వే చేసి 323 మందికి మెడిసిన్ కిట్స్ను అందించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20లక్షల పైచిలుకుగా ఇండ్లను సర్వే చేశారు.
వనపర్తి జిల్లాలో ఫీవర్ సర్వేలో భాగంగా 546 బృందాలు పాల్గొన్నాయి. మంగళవారం 19620 ఇళ్లలో సర్వే చేశారు. 386 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మెడిసిన్ కిట్లు అందించారు. మొత్త సర్వేలో ఇప్పటి వరకు144939 ఇళ్ల సర్వే పూర్తికాగా అందులో 6298 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లు పంపిణీ చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం 36,971 ఇళ్లవద్ద ఫీవర్ సర్వే చేశారు. అందులో 599మంది కొవిడ్ అనుమానితులుగా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 2848 మంది పీహెచ్సీలలో చికిత్సలు చేయించుకోగా 354మందికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 953మంది కొవిడ్ అనుమానితులను గుర్తించిన వారికి కిట్లను అందజేశారు.