తండ్రి లేడు.. తల్లి వేరే పెళ్లి చేసుకుంది.. అర్ధరాత్రి చలిలో రోడ్డుపై నిద్రపోతున్న బాలుడి మాటలివి..

ABN , First Publish Date - 2022-01-12T19:37:30+05:30 IST

హర్యానాలోని హిసార్‌లోని చైల్డ్ ప్రొటక్షన్ టీమ్ సభ్యుడైన మనోజ్ శర్మ మంగళవారం రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వెళ్తున్నారు..

తండ్రి లేడు.. తల్లి వేరే పెళ్లి చేసుకుంది.. అర్ధరాత్రి చలిలో రోడ్డుపై నిద్రపోతున్న బాలుడి మాటలివి..

హర్యానాలోని హిసార్‌లోని చైల్డ్ ప్రొటక్షన్ టీమ్ సభ్యుడైన మనోజ్ శర్మ మంగళవారం రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వెళ్తున్నారు.. కారులో హీటర్ ఆన్ చేసి ఉన్నా అతనికి చలి వేస్తోంది.. అంతటి చలి ప్రదేశంలో రోడ్డు పక్కన పేవ్‌మెంట్ మీద నిద్రపోతున్న నలుగురు చిన్న పిల్లలు అతని కంటబడ్డారు.. వెంటనే కారు ఆపి వారి వివరాలు తెలుసుకున్నారు.. చైల్డ్ ప్రొటక్షన్ టీమ్‌కు ఫోన్ చేసి ఈ పిల్లలను వారికి అప్పగించారు.. ఆ పిల్లల్లో ఒక బాలుడు చెప్పిన మాటలు ఆయనను కదలించాయి. 


`మాది రాజస్థాన్. మా నాన్న చనిపోయాడు. మా అమ్మ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ వ్యక్తి నన్ను తన బంధువుకు అప్పగించాడు. అతను రాజస్థాన్ నుంచి నన్ను హిసార్ తీసుకొచ్చాడు. ఇక్కడే ఉండి రోజంతా భిక్షం ఎత్తమని చెప్పాడు. మూడు గంటలకు ఒకసారి వచ్చి డబ్బులన్నీ తీసుకెళ్తుంటాడు. ఇంటికి పంపించమని ఎంతగానో అడుగుతున్నా. అతను మాత్రం వినడం లేద`ని ఎనిమిదేళ్ల బాలుడు చెప్పాడు. అక్కడున్న నలుగురినీ ఒకే వ్యక్తి రాజస్థాన్ నుంచి తీసుకు వచ్చినట్టు చెల్డ్ ప్రొటక్షన్ టీమ్ భావిస్తోంది. 


ఆ వ్యక్తిపై పోలీసులకు మనోజ్ శర్మ ఫిర్యాదు చేశారు. చైల్డ్ ప్రొటక్షన్ టీమ్ సహకారంతో నలుగురు పిల్లలను వసతి గృహానికి తరలించారు. రాజస్థాన్‌లోని వారి తల్లిదండ్రుల గురించి ఆరా తీస్తున్నారు. మొత్తం నలుగురి వయసు 5 నుంచి 13 ఏళ్ల లోపు ఉంటుందని, మొత్తం ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారని మనోజ్ చెప్పారు. 

Updated Date - 2022-01-12T19:37:30+05:30 IST