ఆన్లైన్ తరగతుల్లో.. ప్రతి 45 నిమిషాలకు విరామం తప్పనిసరి
ABN , First Publish Date - 2020-07-04T08:53:03+05:30 IST
గతంలో స్మార్ట్ఫోన్ చూసేందుకు అనుమతించని తల్లిదండ్రులు, ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల కోసం వారికి ఫోన్లను అప్పగించాల్సిన
- విద్యార్థులకు ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య నిపుణుల సూచనలు
హైదరాబాద్ సిటీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): గతంలో స్మార్ట్ఫోన్ చూసేందుకు అనుమతించని తల్లిదండ్రులు, ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల కోసం వారికి ఫోన్లను అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో స్మార్ట్ఫోన్ను విద్యార్థులకు దూరంగా ఉంచాలన్న అధ్యాపకులే నేడు ఆన్లైన్ క్లాసుల కోసం వారికి తప్పనిసరిగా స్మార్ట్ ఉపకరణాలను అందించాలంటున్నారు. గంటల తరబడి ఆన్లైన్ క్లాసులు, అనంతరం హోంవర్క్కూడా ఇవ్వడంతో దాదాపు ప్రతి విధ్యార్థి 6 నుంచి 8 గంటల పాటు స్మార్ట్ ఫోన్, ట్యాబ్ లేదా ల్యాప్టా్పలను వినియోగిస్తున్నారు. కరోనా కాలంలో ఇల్లు కదలకుండా ఉన్న పిల్లలు ఆన్లైన్జ్ క్లాసుల పేరుతో గంటల తరబడి ఫోన్ లేదా కంప్యూటర్ స్ర్కీన్ ముందు కూర్చుంటున్నారు. దాంతో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (సీవీసీ), కళ్లు పొడిబారడం, కళ్లు అలసటకు గురికావడం వంటి లక్షణాలు పిల్లల్లో కూడా కనిపించే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఆన్లైన్ పాఠాలు వింటున్న పిల్లలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వయస్సును బట్టి ఆన్లైన్ క్లాసులు
3 ఏళ్లలోపు పిల్లలకు ఆన్లైన్ తరగతులు వద్దు.
4 నుంచి 6 ఏళ్ల వారికి ఒక విరామం ఇచ్చి 90 నిమిషాల పాటు ఆన్లైన్ క్లాసు నిర్వహించవచ్చు.
7 నుంచి 12 ఏళ్లలోపు వారికి 2 లేదా 3 విరామాలిచ్చి 3 నుంచి 4 గంటల పాటు క్లాసులు నిర్వహించవచ్చు.
12 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు భోజన విరామంతోపాటు 5 లేదా 6 విరామాలతో 6 నుంచి 8 గంటల పాటు క్లాసులు నిర్వహించవచ్చు.
ప్రతి 45 నిమిషాలకు తప్పనిసరిగా కొద్ది సేపు విరామం ఇవ్వాలి.
ఆన్లైన్ హోం వర్క్ తగ్గించడం మంచిది.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేయాల్సినవి
ప్రతి నిమిషానికి 10 సార్లైనా కనురెప్పలు మూసి తెరిచేలా చూడాలి
20-20-20 రూల్ ప్రకారం పిల్లలు ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వాటిపై 20 సెకన్లు దృష్టి కేంద్రీకరించేలా చూడాలి.
ప్రతి క్లాసుకు మధ్యలో లేచి అటు ఇటు తిరిగేలా ప్రోత్సహించాలి.
తరగతులు స్మార్ట్ ఫోన్లలో కాకుండా టీవీ, ల్యాప్టాప్, డెస్క్టా్పలలో వినేలా ఏర్పాట్లు చేయాలి.
పిల్లల కంటికి స్ర్కీన్ 18 నుంచి 24 అంగుళాల దూరంలో ఉండాలి.
పిల్లలకు వచ్చే సమస్యలు
పిల్లల్లో దృష్టి సమస్యలు ఏర్పడే అవకాశముంది. దూరంగా ఉన్నవి మసకగా కనిపిస్తాయి. కొన్ని సార్లు మానసికసమస్యలు తలెత్తుతాయి.
సరిగా నిద్ర పట్టకపోవడంతో నిద్ర పోయే సమయాల్లో చాలా మార్పులు వస్తాయి.
తల్లిదండ్రులు సంయమనం పాటించాలి
పిల్లల ముందు తల్లిదండ్రులు ఫోన్ వినియోగం తగ్గించుకోవాలి. ఆన్లైన్ క్లాసులు వింటున్న పిల్లలకు, ప్రతి 45 నిమిషాలకు ఒకసారి తప్పనిసరిగా విరామం ఇవ్వాలి. విరామ సమయంలో డ్యాన్స్ లేదా యోగా వంటివి చేయాలి. ఎక్కువసేపు మానిటర్ను చూడటం వల్ల మయోపియా (దూరంగా ఉన్న వస్తువులు మసకగా కనబడటం) వస్తోంది. నిద్రలేమి, మానసిక సమస్యలు తలెత్తుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకొని కళ్లను సంరక్షించుకోవాలి.
డాక్టర్ రమేష్, ఎల్వీ ప్రసాద్ చైల్డ్ సైట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్