రాజధాని భూముల కేసులో
ABN , First Publish Date - 2020-09-21T08:32:08+05:30 IST
రాజధాని భూముల వ్యవహారానికి సంబంధించి గుంటూరు ఏసీబీ అధికారులు ఈ నెల 15వ తేదీన నమోదు చేసిన
ఇచ్చిన ఉత్తర్వులను సవరించండి
హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు
అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాజధాని భూముల వ్యవహారానికి సంబంధించి గుంటూరు ఏసీబీ అధికారులు ఈ నెల 15వ తేదీన నమోదు చేసిన కేసు విచారణపై స్టే విధించడంతో పాటు ఈ కేసులో ఎలాంటి చర్యలకు దిగరాదని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ఈ కేసు ఎఫ్ఐఆర్ గురించి గానీ, అందులోని వివరాల గురించి గానీ ప్రింట్, ఎలకా్ట్రనిక్, సామాజిక మాధ్యమాల ద్వారా బహిర్గతం కావడానికి వీల్లేదని ఆదేశిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది.
ఈ మేరకు మహబూబ్నగర్కు చెందిన న్యాయవాది మమతారాణి గాలేటి హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ నమోదు చేసిన ఆ కేసు పూర్వాపరాలు మాధ్యమాల్లో బహిర్గతం కావడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు ఇవ్వడం.. మీడియా సంస్థల వాక్ స్వాతంత్య్రంపై ఆంక్షలు విధించినట్లుగా ఉందని పిటిషన్లో తెలిపారు.
రాజ్యాంగం ప్రకారం వాక్ స్వాతంత్య్రం.. మీడియాకున్న పవిత్రమైన హక్కని, దానిని హరించేలా ఇలాంటి నిషేధాజ్ఞలు ఇవ్వకూడదన్నారు. ఈ పిటిషన్లో తనను ప్రతివాదిగా చేర్చుకుని, తన వాదనలను కూడా వినాలని.. ఇచ్చిన ఉత్తర్వులను సవరించి, తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.