బాలికపై అత్యాచారం కేసులో హోంగార్డుకు 30 ఏళ్ల జైలు
ABN , First Publish Date - 2021-08-04T08:43:07+05:30 IST
బాలికపై అత్యాచారం చేసి గర్భానికి కారకుడైన సీసీఎస్ హోంగార్డుకు సికింద్రాబాద్ కోర్టు 30 ఏళ్ల..
సికింద్రాబాద్ కోర్టు సంచలన తీర్పు
అడ్డగుట్ట, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): బాలికపై అత్యాచారం చేసి గర్భానికి కారకుడైన సీసీఎస్ హోంగార్డుకు సికింద్రాబాద్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష, రూ 50 వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. తుకారాంగేట్ సీఐ ఎల్లప్ప కథనం ప్రకారం అడ్డగుట్టకు చెందిన రాములు కుమారుడు మల్లికార్జున్ (40) హైద్రాబాద్ సీసీఎ్సలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. గత ఫిబ్రవరి 18న ఇంటి పక్కనే ఉంటున్న 16 ఏళ్ల బాలికపై మల్లికార్జున్ అత్యాచారంచేశాడు.
ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక నాలుగు నెలల గర్భవతి కావడంతో తల్లికి అనుమానం వచ్చి, కూతురిని అడిగి జరిగిన విషయం తెలుసుకుంది. తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో తల్లి ఫిర్యాదు చేసింది. అంతకు ముందు తల్లిదండ్రులు ఆ బాలికకు ఆబార్షన్ చేయించారు. పోలీసులు బాలికకు ఎస్ఎ్ఫఎల్, డీఎన్ఏ టెస్టులు చేయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించి సికింద్రాబాద్ సివిల్ కోర్టు 1వ అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తి కె.సునీత నిందితుడైన మల్లికార్జున్కు శిక్ష విధించారు. రాష్ట్ర పోలీస్ చరిత్రలో 30 ఏళ్ల జైలు శిక్ష విధించిన మొదటి కేసు ఇది. బాధితురాలికి లీగల్ సెల్ అధారిటీ నుంచి వైద్య ఖర్చులకు రూ.7 లక్షలు చెల్లించాలని కోర్టు సూచించింది.