టీఆర్‌ఎస్‌లో.. అసమ్మతి షికారు!

ABN , First Publish Date - 2021-11-30T05:41:16+05:30 IST

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యం కావడం తో అధికార పార్టీని అసమ్మతి గుబులు వెంటాడుతోంది.

టీఆర్‌ఎస్‌లో.. అసమ్మతి షికారు!


టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థికి సొంత పార్టీ మద్దతుపై అనుమానాలు
పార్టీలకతీతంగా ఒక్కటవుతున్న ఆదివాసీ నేతలు
ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు
మెజార్టీ ఉన్నా.. అధికార పార్టీ నేతల్లో అయోమయం


ఆదిలాబాద్‌, నవంబరు29 (ఆంధ్రజ్యోతి) :
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యం కావడం తో అధికార పార్టీని అసమ్మతి గుబులు వెంటాడుతోంది. చివరి వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండెవిఠల్‌ను ఏకగ్రీవం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కక పోవడంతో ఆ పార్టీ నేతలు గెలుపు మార్గాలను అన్వేషిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ఉమ్మడి జిల్లాలో పూర్తి మెజార్టీ ఉన్నా ఆ పార్టీ నేతల్లో ఏదో తెలియని అయోమయం కనిపిస్తోంది. మొత్తం 937 మంది ఓటర్లు ఉండగా కాంగ్రెస్‌ 80, బీజేపీ 70, మిగతా 787 టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే కొందరు జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు స్వతంత్రంగా గెలుపొంది ఇ ప్పటికే అధికార పార్టీలో చేరిపోయారు. అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు నామినేషన్‌ వేసి విత్‌డ్రా చేసుకున్న వారి మద్దతు పై మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సారంగాపూర్‌ జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి వెనక్కి తగ్గక పోవడం అధికార పార్టీకి కొంత ఇబ్బందికరంగానే మారుతోంది. కొందరు బయటకు వచ్చి ధైర్యం చేయలేకపోతున్నా లోలోపల మాత్రం రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఓటు రూపంలోనే ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న ఉద్దేశంతో పార్టీ అధిష్ఠానం ఉన్న జిల్లా నేతల తీరు మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తోంది.  ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుపై కచ్చితంగా చెప్పలేక పోతున్న టీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమంటూ దాట వేసే ధోరణితో కనిపిస్తున్నారు.
నోట్లతో ఓటుకు గాలం..
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండె విఠల్‌ గెలిచేందుకు అవసరమైన పూర్తి మెజార్టీ ఉన్న సొంత పార్టీ నేతల మద్దతుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. తామునమ్ముకున్న నేతలను కాదని పార్టీ అధిష్ఠానం అనూహ్యంగా మరోనేతకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. అధికార పార్టీలో ఉండీ ఏమీ చేయలేమన్న భావన వ్యక్తం చేస్తూ మిన్నకుండిపోతున్నారు. ఓటు రూపంలోనే తమ తడాకా ఏమిటో చూపుతామంటూ కొందరు జడ్పీటీసీ, ఎంపీటీసీలు భగ్గుమంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో టీఆర్‌ఎస్‌ నేతలు నోటుకు ఓటు పైననే భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. ఒక్కో ఓటుకు రూ.లక్ష నుంచి రూ.2లక్ష వరకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 750 మంది ఓటర్లను టార్గెట్‌ పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ అవసరమైతే మరింత పెంచాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులను క్యాంపునకు తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్న పనే అయినప్పటికీ తప్పదంటున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహాంతో ముందుకెళ్తోంది.
ఆదివాసీల ఉడుంపట్టు..
ఆదివాసీ అభ్యర్థి పెందూరు పుష్పరాణిని ఎలాగైనా గెలిపించాలనే పట్టుదలతో ఆదివాసీ సంఘాల నేతలు కనిపిస్తున్నారు. ఎవరు ఊహించని విధంగా గత పార్లమెంట్‌ ఎన్నికల్లో సోయంబాపురావును ఎంపీగా గెలిపించిన మాదిరిగానే ఎమ్మెల్సీ అభ్యర్థికి గంపగుత్తగా మద్దతు తెలుపాలని ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఒక్కటయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆదివాసీ ప్రజా ప్రతినిధుల ప్రభావం ఎక్కువ కావడంతో ఈ రెండు జిల్లాల పైననే ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి వ్యతిరేకంగా 23 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ వేసి టీఆర్‌ఎస్‌ ప్రలోభాలకు విత్‌డ్రా చేసుకున్న ఎదురొడ్డి నిలిచిన పుష్పరాణికి ఆదివాసీల్లో సానుభూతి పెరుగుతూ వస్తోంది. అలాగే నామినేషన్ల ఉప సంహరణ చివరి రోజు కలెక్టరేట్‌లో జరిగిన రాజకీయ పరిణామాలను ఆదివాసీలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా టీఆర్‌ఎస్‌ వ్యవహరించిందంటూ మండిపడుతున్నారు.
విధులు, నిధులపై అసంతృప్తి..
ఎన్నో ఆశలతో జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా గెలిచిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు విధులు, నిధులపై తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. గత ఏడాది క్రితమే ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు సిద్ధమయ్యారు. ఏదో ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఎంపీటీసీ, జడ్పీటీసీల పరిస్థితి మారిందంటూ వాపోతున్నారు. ఎన్నికల్లో గెలుపొంది మూడేళ్లు గడిచిపోతున్న హామీలను నెరవేర్చలేక గ్రామాల్లో తలెత్తుకుని తిరగలేక పోతున్నామంటూ చెబుతున్నారు. ప్రజలు హామీ ల పై నిలదీస్తే నీళ్లు మింగే పరిస్థితే ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీలను కేవలం ఎన్నికల సమయంలోనే వాడుకుంటూ ఆ తర్వాత విస్మరిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌బీపాస్‌ను మున్సిపల్‌ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇంటి నిర్మాణాల సమయంలో కౌన్సిలర్లకు సంబంధం లేకుండానే అనుమతులు ఇవ్వడా న్ని తప్పుబడుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా గెలిచిన ప్ర యోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులతో ప్రభుత్వ విధానాలపై స్థానిక సంస్థల ప్రజా ప్ర తినిధులు తీవ్ర అసంతృప్తితోనే ఉన్న ట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మె ల్సీ ఎన్నికల్లో ఎవరి కి మద్ధతుగా నిలుస్తారోనన్న టాక్‌ హాట్‌టాపిక్‌గా మారింది.

Updated Date - 2021-11-30T05:41:16+05:30 IST