కష్టకాలంలోనూ ఆగని దోపిడీ

ABN , First Publish Date - 2020-06-24T05:48:50+05:30 IST

అంతవరకూ ప్రజలను లాఠీలతో బాది, దీపాలు బాజాల పేరిట కరోనాపై పోరు సాగిస్తున్నట్టుగా భ్రమింపచేసి, రోగం వేగంగా విస్తరిస్తున్న దశలో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఎత్తేశాయి...

కష్టకాలంలోనూ ఆగని దోపిడీ

అంతవరకూ ప్రజలను లాఠీలతో బాది, దీపాలు బాజాల పేరిట కరోనాపై పోరు సాగిస్తున్నట్టుగా భ్రమింపచేసి, రోగం వేగంగా విస్తరిస్తున్న దశలో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఎత్తేశాయి. ప్రజల ఆరోగ్యాలకంటే ఆర్థిక రంగం కాంతులీనడమే తమకు ప్రధానమన్నాయి. విధిలేక, పూటగడవని స్థితిలో, ఉద్యోగాలూ ఉపాధులూ దెబ్బతినిపోతాయన్న భయంతో జనం కూడా బయటకు రాక తప్పలేదు. వచ్చి రోగాన పడుతున్నవారిని కూడా పాలకులు వారి ఖర్మానికి వదిలేశారు. ఇంతటి దుస్థితిలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌ నుంచి తమ వాటాలు కోటాలు పిండుకోవడం ఆపలేదు సరికదా, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పడిపోతున్న ప్రస్తుత దశలోనూ రేట్లు పెంచుతూపోతున్నారు. ఈ కష్టకాలంలో ప్రజలకు పైసా విదల్చడానికి కేంద్రం దగ్గర సొమ్ము లేదు కానీ, విదేశీ మారక ద్రవ్యం మాత్రం ఎన్నడూ లేనంత ఉచ్ఛస్థితిలో ఉన్నదంటే ఉండదా మరి. మొన్నటివరకూ జనం దగ్గర మరిన్ని పన్నులతో బాది దోచుకున్నది చాలదా? పదిహేను రోజులుగా వరుస పెరకవలతో మొత్తంగా పెట్రోల్‌ పదిరూపాయలు, డీజిల్ ఎనిమిది రూపాయలు పెరిగాయి. ఈ కష్టకాలంలో మినహాయింపులు ఇవ్వాల్సింది పోయి అదనపు సుంకాలు వేయడమేమిటి? నిత్యావసరాలు మండిపోవా? చిరుద్యోగులు, చిరువ్యాపారులు ఏమైపోతారు? ఆర్థికవ్యవస్థ మాత్రం ఎలా పుంజుకుంటుంది? పాలకులు మరీ ఇంత అమానవీయంగా ఉంటే ఎలా? రాష్ట్రాలు అడగవు, విపక్షాలూ ప్రశ్నించవు. ప్రతీదానికీ ప్రజల పక్షాన మాట్లాడుతున్నామని చెప్పుకొనే పలు సంఘాలకు కూడా సామాన్యుడి మనుగడకు సంబంధించిన ఈ కీలకమైన అంశం పట్టకపోవడం మరీ విచిత్రం.

నల్లాన్‌ వి. ఆచార్య

Updated Date - 2020-06-24T05:48:50+05:30 IST