హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం.. సాయానికి ప్రధాని హామీ..

ABN , First Publish Date - 2021-07-12T23:21:43+05:30 IST

కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. ఒక్కసారిగా పోటెత్తిన వరదల కారణంగా ధర్మశాలలో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది...

హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం.. సాయానికి ప్రధాని హామీ..

డెహ్రాడూన్: కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. ఒక్కసారిగా పోటెత్తిన వరదల కారణంగా ధర్మశాలలో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. వరద ధాటికి  కొన్ని వాహనాలు మొరాయించగా.. మరికొన్ని వాహనాలు నీటిలో మునిగిపోయాయి. భగ్సునాగ్ ప్రాంతంలో రోడ్లపై కనీసం నడిచే అవకాశం కూడా లేకపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు భారీ వర్షాలతో షిమ్లా జిల్లా రామ్‌పూర్ ప్రాంతంలోని జాక్రీ సమీపంలో జాతీయ రహదారి స్తంభించిపోయింది. ధర్మశాలకు 58 కిలోమీటర్ల దూరంలోని కాంగ్రా జిల్లాలో వరద పోటుకు హోటళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

కాగా హిమాచల్ ప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇవాళ ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘హిమాచల్ ప్రదేశ్‌లో నెలకొన్ని వరద పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అధికారులు పనిచేస్తున్నారు. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం అందిస్తాం. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల క్షేమం కోసం నేను ప్రార్థిస్తున్నాను..’’ అని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే తాను రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాగూర్‌తో మాట్లాడినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విటర్లో వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపిస్తున్నట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-07-12T23:21:43+05:30 IST