పాఠశాలలు మూసివేయడం సరికాదు
ABN , First Publish Date - 2021-04-20T05:30:00+05:30 IST
ఆకస్మికంగా పాఠశాలలు మూసివేయాలని తీసుకున్న నిర్ణయం సరికాదని ఏపీ ప్రవేటు స్కూల్స్ జాయింగ్ యాక్షన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి
ప్రైవేటు స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ
బుచ్చెయ్యపేట, ఏప్రిల్ 20: ఆకస్మికంగా పాఠశాలలు మూసివేయాలని తీసుకున్న నిర్ణయం సరికాదని ఏపీ ప్రవేటు స్కూల్స్ జాయింగ్ యాక్షన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం వడ్డాదిలో కమిటీ ప్రతినిధులు వీవీ రామరాజు, పి.రమణ, సిహెచ్.రాంబాబు, టి.వరప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ నైపథ్యంలో కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం పాఠశాలలను మూసి వేస్తున్నట్టుగా ప్రకటించడంతో ప్రవేటు పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కరోనా లాక్డౌన్తో పాఠశాలలు నడవని కారణంగా సక్రమంగా ఫీజులు వసూలు కాక కొన్ని విద్యా సంస్థలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయని వాపోయారు. దీంతో ఉపాధ్యాయులు, భోదనేతర సిబ్బంది జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ స్కూల్స్ మూసివేయడంతో రాష్ట్రంలో 11 వేలకుపైగా నిరుద్యోగ కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయని వారు వాపోయారు. వారిని ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.