రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం పెంపు

ABN , First Publish Date - 2021-08-04T09:08:15+05:30 IST

రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఇచ్చే నష్టపరిహారాన్ని గణనీయంగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది.

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం పెంపు

  • ప్రమాదానికి కారకులు తెలియని కేసుల్లో...
  • మృతులకు 2లక్షలు, క్షతగాత్రులకు 50వేలు
  • కారకులు తెలిసిన కేసుల్లో అయితే...
  • మృతులకు 5లక్షలు, క్షతగాత్రులకు 2.5లక్షలు
  • వాహన బీమా ఉంటే పరిహారం 10 రెట్లు
  • కొత్తగా ‘మోటారు వాహన ప్రమాద నిధి’
  • కేంద్ర ప్రభుత్వ ముసాయిదా నిబంధనలు


న్యూఢిల్లీ, ఆగస్టు 3: రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఇచ్చే నష్టపరిహారాన్ని గణనీయంగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను ఇప్పటికే రూపొందించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీన్ని అనుసరించి... ప్రమాదాలకు కారణమైన వారిని గుర్తించలేని కేసుల్లో మృతుల కుటుంబాలకు అందించే పరిహారం రూ.2లక్షలకు పెరగనుంది. ప్రస్తుతం ఇలాంటి బాధితులకు రూ. 25వేలు మాత్రమే ఇస్తున్నారు. అలాగే తీవ్ర గాయాలపాలైన వారికి ప్రస్తుతం రూ.12,500 మాత్రమే పరిహారంగా ఇస్తున్నారు. ప్రతిపాదిత నిబంధనలను అనుసరించి వీరికి రూ.50వేలు ఇస్తారు.


ప్రమాదాలకు కారకులను, వారి వాహనాలను గుర్తించిన కేసుల్లో... మృతులకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ. 2.5లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే ప్రమాదాలకు కారణమైన వాహనాలకు ఇన్సూరెన్స్‌ ఉంటే.. బాధితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని ఇప్పుడున్న దానికంటే 10 రెట్లు పెంచనున్నారు. ఆ మొత్తాన్ని బీమా సంస్థలే చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిందితులు దొరకని కేసుల్లో బాధితులకు న్యాయం చేయడానికి ప్రత్యేకంగా ‘మోటారు వాహన ప్రమాద నిధి’ని కూడా ఏర్పాటు చేయనున్నారు. బాధితులకు ఈ నిధి నుంచి ప్రభుత్వం సహాయాన్ని అందించనుంది. ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు, బాధితులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా మం త్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పూర్తిస్థాయి మార్గదర్శకాలను సర్కారు త్వరలోనే ప్రకటించనుంది.

Updated Date - 2021-08-04T09:08:15+05:30 IST