ఇయర్ ఫోన్స్ అతిగా వాడుతున్నారా?.. అయితే ఇది మీకోసమే!

ABN , First Publish Date - 2020-11-20T03:16:46+05:30 IST

కరోనా వైరస్ కారణంగా చాలా వరకు కార్యాలయాలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు ఇవ్వగా, విద్యాసంస్థలు

ఇయర్ ఫోన్స్ అతిగా వాడుతున్నారా?.. అయితే ఇది మీకోసమే!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా చాలా వరకు కార్యాలయాలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు ఇవ్వగా, విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నాయి. లాక్‌డౌన్ నుంచి దాదాపు 9 నెలలుగా ఇది కొనసాగుతోంది. ఈ రెండు సందర్భాలలో ఇయర్ ఫోన్స్‌ను అతిగా వినియోగించడం వల్ల వినికిడి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని,  చెవుల్లో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వాటి వాడకాన్ని వీలైనంతగా తగ్గించాలని సూచిస్తున్నారు.


తమ వద్దకు వచ్చే వినికిడి సమస్యల కేసులన్నీ నేరుగా ఇయర్‌ఫోన్స్‌తో సంబంధం ఉన్నవేనని ముంబైలోని జేజే ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగం హెడ్ డాక్టర్ శ్రీనివాస్ చవాన్ పేర్కొన్నారు. హెడ్‌ఫోన్లను ఎక్కువ శబ్దంతో వినడమే ఇందుకు కారణమన్నారు. ఇయర్ ఫోన్ల వినియోగాన్ని ఇప్పటికైనా తగ్గించకుంటే ఈ సమస్యలు శాశ్వతంగా మారిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ చవాన్ హెచ్చరించారు. చాలామంది 8 గంటలకు మించి హెడ్‌ఫోన్లు ధరించి పనిచేస్తున్నారని, ఫలితంగా వారి చెవులపై విపరీతమైన ఒత్తిడి పడుతుందని, స్టెరిలైజ్ కాని ఇయర్ పాడ్స్, ఇయర్ ప్లగ్స్ ఇన్ఫెక్షన్‌ను వ్యాప్తి చేస్తాయని వివరించారు. అలాగే, చెవిలోని గులిమిని కాటన్ బడ్ ఉపయోగించి తీయడం కూడా ప్రమాదకరమేనని పేర్కొన్నారు. 


చెవిలో గులిమి ఉండాలని, అది ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుందని అన్నారు. ఇయర్ ఫోన్స్‌ను ఎప్పటికప్పుడు బయటకు తీస్తూ తాజా గాలి చెవిలోకి వెళ్లేలా చూసుకోవాలని సూచించారు. ఏది ఏమైనా స్కూలు పిల్లలు హెడ్‌ఫోన్స్ వాడకపోవడమే ఉత్తమమని ముంబైలోని సెయింట్ జార్జ్ ఆసుపత్రి ఈఎన్‌టీ హెడ్ డాక్టర్ రాహుల్ కుల్‌కర్ణి పేర్కొన్నారు.  

Updated Date - 2020-11-20T03:16:46+05:30 IST