అక్రమార్కులకు అడ్డాగా విదేశీ వాణిజ్యం
ABN , First Publish Date - 2020-03-04T06:29:10+05:30 IST
అక్రమార్కులు విదేశీ వాణిజ్యాన్నీ వదలడం లేదు. తప్పుడు ఇన్వాయి్సలతో పెద్ద మొత్తంలో నిధులను అక్రమంగా దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచంలో...
మిస్ ఇన్వాయిసింగ్లో భారత్కు మూడో స్థానం
ఏటా రూ.6.10 లక్షల కోట్ల తరలింపు
న్యూఢిల్లీ : అక్రమార్కులు విదేశీ వాణిజ్యాన్నీ వదలడం లేదు. తప్పుడు ఇన్వాయి్సలతో పెద్ద మొత్తంలో నిధులను అక్రమంగా దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచంలో చైనా, మెక్సికోల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. మిస్ ఇన్వాయిసింగ్ ద్వారా భారత్ నుంచి తరలిపోయే నిధుల మొత్తం ఏటా ఎంత లేదన్నా 8,350 కోట్ల డాలర్లు (సుమారు రూ.6.19 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎ్ఫఐ) అనే అమెరికా మేధో సంస్థ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అక్రమార్కులు చేపడుతున్న ఈ తరహా లావాదేవీలతో ప్రభుత్వ పన్నుల వసూళ్లకూ భారీగా గండి పడుతోంది. 2008-17 మధ్య కాలానికి మొత్తం 135 వర్ధమాన దేశాల ద్వారా జరిగిన అక్రమ లావాదేవీలను పరిశీలించి జీఎ్ఫఐ ఈ నివేదికను రూపొందించింది. 2008-17 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 136 వర్ధమాన దేశాలు, 36 సంపన్న దేశాల మఽధ్య జరిగిన వాణిజ్యంలో అక్రమ నిధుల లావాదేవీల విలువ ఎంత లేదన్నా ఏటా 8.8 లక్షల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని తెలిపింది. భారత్ విషయానికి వస్తే ఈ పదేళ్ల కాలంలో ఏటా సగటున 7,790 కోట్ల డాలర్ల నిధులు అక్రమంగా విదేశాలకు తరలిపోయాయని జీఎ్ఫఐ అంచనా. ఇక చైనా నుంచి 2017లో ఈ తరహా ఇన్వాయి్సల ద్వారా 45,770 కోట్ల డాలర్లు సరిహద్దులు దాటిపోగా మెక్సికో నుంచి 8,530 కోట్ల డాలర్లు తరలిపోయాయి. కాగా నాలుగు, ఐదు స్థానాల్లో రష్యా, పోలండ్ నిలిచాయి.
నిధుల మళ్లింపు మార్గాలివే..
మిస్ ఇన్వాయిసింగ్ ద్వారా అక్రమార్కులు నిధులను ఎలా సరిహద్దులు దాటిస్తున్నారు? ఆ నిధులు ఎలా సంపాదిస్తున్నారనే విషయాన్నీ జీఎ్ఫఐ బయటపెట్టింది. వాణిజ్య పన్నుల ఎగవేత, అవినీతి, అంతర్జాతీయ నేరాల ద్వారా ఈ ముఠాలు పెద్ద ఎత్తున సంపాదిస్తున్నాయి. అక్రమంగా సంపాదించిన ఆ నిధులను సరిహద్దులు దాటించి, వినియోగించడాన్ని ఈ సంస్థ అక్రమ నిధుల ప్రవాహంగా పేర్కొం ది. మాదక ద్రవ్యాల ముఠాల నిధుల బదిలీని జీఎ్ఫఐ ఇందుకు ఉదాహరణగా పేర్కొంది. వాటి అమ్మకం ద్వారా సంపాదించిన అక్రమ సంపాదనను ఈ ముఠాలు ఏదో ఒక ఎగుమతి, దిగుమతి సంస్థ తప్పుడు ఇన్వాయి్సల ద్వారా ముందు సరిహద్దులు దాటిస్తాయి. తర్వాత ఆ నిధులతో పా త కార్లను కొని, మాదక ద్రవ్యాలు సరఫరా చేసే దేశాలకు సరఫరా చేసి, అక్కడ ఆ కార్లను అమ్మేస్తున్నట్టు తెలిపింది.