ఇంగ్లండ్ బౌలర్లకు తలవంచిన టీమిండియా.. 78 పరుగులకే ఆలౌట్
ABN , First Publish Date - 2021-08-26T01:02:52+05:30 IST
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు దారుణంగా ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్
లీడ్స్: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు దారుణంగా ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ ఎంత తప్పు చేశాడో తొలి ఓవర్లోనే తెలిసిపోయింది. ఇంగ్లండ్ బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు వికెట్లు సమర్పించుకున్న భారత బ్యాట్స్మెన్ ఏమాత్రం పోరాట పటిమ చూపించలేకపోయారు. హేమాహేమీలందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. టీమిండియాలో రోహిత్ శర్మ చేసిన 19 పరుగులే అత్యధికం కాగా, ఆ తర్వాత రహానే చేసిన 18 పరుగులే రెండో అత్యధికం. మిగతా వారిలో ఎవరూ కనీసం పది పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితంగా 78 పరుగులకు కోహ్లీ సేన ఆలౌట్ అయింది.
భారత బ్యాట్స్మన్లలో ముగ్గురు ఆటగాళ్లు.. కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా డకౌట్ కాగా, ఆరుగురు ఆటగాళ్లు పుజారా (1), కోహ్లీ (7), పంత్ (2), జడేజా (4), ఇషాంత్ శర్మ (8) సిరాజ్ (3) పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు.
ఇక ఆతిథ్య బౌలర్లలో జేమ్స్ అండర్సన్ తొలుత భారత జట్టు ఇన్నింగ్స్ను కుప్పకూల్చగా, ఆ తర్వాత రాబిన్సన్, శామ్ కరన్, క్రెయిగ్ ఒవెర్టన్లు భారత్ పని పట్టారు. పోటాపోటీగా వికెట్లు తీస్తూ టీమిండియా బ్యాటింగ్ను కుప్పకూల్చారు. వీరిలో అండర్సన్, ఒవెర్టన్ చెరో మూడు వికెట్లు తీయగా, రాబిన్సన్, శామ్ కరన్ రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు.