పాక్ ప్రధాని ఇమ్రాన్ విమానానికి భారత్ గ్రీన్ సిగ్నల్
ABN , First Publish Date - 2021-02-23T17:05:46+05:30 IST
పొరుగు దేశమైన పాకిస్థాన్ దేశం చేసిన అభ్యర్థనను భారతదేశం మన్నించి పెద్దమనసు చాటుకుంది....
పెద్ద మనసు చాటుకున్న భారత్
న్యూఢిల్లీ : పొరుగు దేశమైన పాకిస్థాన్ దేశం చేసిన అభ్యర్థనను భారతదేశం మన్నించి పెద్దమనసు చాటుకుంది. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ ఫిబ్రవరి 23వతేదీ నుంచి శ్రీలంక దేశ పర్యటన కోసం భారత గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతించాలని దాయాది దేశమైన పాకిస్థాన్ చేసిన వినతిని భారత్ అడ్డు చెప్పకుండా అనుమతి మంజూరు చేసింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ విమానం భారత గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించినట్లు కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం దేశాధినేతలు వీవీఐపీ విమానాలు ఏ ఇతర దేశాల గగనతలం గుండా వెళ్లినా దానికి అనుమతి తీసుకోవాలి. అయితే గతంలో పాకిస్థాన్ భారత విమానాలు తమ దేశ గగనతలం మీదుగా వెళ్లకుండా నిషేధం విధించింది.
భారత ప్రధాని మోదీ పాక్ మీదుగా అమెరికా, సౌదీ అరేబియా వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమతించలేదు. 2019లో భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన యూరప్ పర్యటన సందర్భంగా పాక్ అనుమతించలేదు.దీంతో మరో మార్గంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్ లు ప్రయాణించిన విమానం వెళ్లింది. గతంలో పాకిస్థాన్ వ్యవహారంపై భారతదేశం అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థకు ఫిర్యాదు కూడా చేసింది. నాడు భారత విమానాలు పాక్ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు పాకిస్థాన్ నిరాకరించినా, భారత్ మాత్రం పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రయాణించే విమానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెద్దమనసు చాటుకుంది.