- టీమిండియాను వేధిస్తున్న గాయాలు
- ఒత్తిడిలో ఆస్ట్రేలియా
- రేపటి నుంచి నాలుగో టెస్ట్
- సోనీ సిక్స్లో ఉ. 5 గం.నుంచి
అడిలైడ్లో అట్టర్ ఫ్లాపయినా.. మెల్బోర్న్లో మెరిసి.. సిడ్నీలో శభాష్ అనిపించే డ్రాతో నాలుగు టెస్ట్ల సిరీస్ను సజీవంగా నిలబెట్టుకున్న టీమిండియా.. శుక్రవారం నుంచి గాబాలో జరిగే సిరీస్ నిర్ణాయక ఆఖరి టెస్ట్కు సిద్ధమైంది. గత మ్యాచ్ డ్రా తర్వాత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నా.. కీలక ఆటగాళ్లు గాయపడడం జట్టుకు మైన్సగా మారింది. కనీసం ఫిట్గా ఉండే పదకొండు మంది ఆటగాళ్లను తుది జట్టుకు ఎంపిక చేయడమే మేనేజ్మెంట్కు విషమ పరీక్షగా మారింది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మూడో టెస్ట్లో ఆధిపత్యం ప్రదర్శించినా.. గెలుపు దక్కకపోవడంతో నిరాశకు గురైంది. ఈ నేపథ్యంలో బ్రిస్బేన్ టెస్ట్లో గర్జించే విజయంతో సిరీ్సను సొంతం చేసుకోవాలన్న కసితో ఆసీస్.. అందుబాటులో ఉన్న వనరులతో ఆతిథ్య జట్టుకు షాకిచ్చి గ్రాండ్ విక్టరీతో స్వదేశం చేరాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతున్నాయి.
బ్రిస్బేన్: టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటన చరమాంకానికి చేరుకొంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆతిథ్య ఆసీస్ వన్డే సిరీస్ నెగ్గితే.. భారత్ టీ20 సిరీస్ నెగ్గి దీటుగా నిలిచింది. ఇక అసలుసిసలైన టెస్ట్ సిరీ్సకు వచ్చేసరికి పోరాటం శిఖరాగ్ర స్థాయికి చేరింది. నాలుగు టెస్ట్ల సిరీ్సలో భాగంగా అడిలైడ్లో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో దారుణ ఓటమితో సిరీ్సను ఆరంభించిన టీమిండియా.. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్ట్లో కంగారూలకు దిమ్మదిరిగే షాకిచ్చి 1-1తో సిరీస్ సమం చేసింది. ఇక సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్లో చిరస్మరణీయ పోరాటంతో ఆ మ్యాచ్ను డ్రా చేసుకొని ఆతిథ్య జట్టుపై నైతిక విజయం సాధించింది. ఇదే ఉత్సాహంతో శుక్రవారం నుంచి గాబా స్టేడియంలో జరిగే సిరీస్ నిర్ణాయక ఆఖరి, నాలుగో టెస్ట్లో టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అయితే, జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలపాలు కావడం భారత్ను కలవరపెడుతోంది. ఫిట్గా ఉండే 11 మంది ఆటగాళ్లు ఎంపిక చేయడం కెప్టెన్ రహానెకు పెను సవాల్గా మారింది. తాజాగా పేస్ గన్ బుమ్రా కూడా గాయం కారణంగా దూరం కావడంతో.. భారత బౌలింగ్ విభాగం మరింత బలహీనపడింది. రెండు టెస్ట్లు ఆడిన హైదరాబాదీ సిరాజ్ పేస్ దళాన్ని నడిపించాల్సిన పరిస్థితి. యువ ఫాస్ట్ బౌలర్లు సైనీతోపాటు తొలిసారి నటరాజన్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. స్పిన్నర్ అశ్విన్ పూర్తి ఫిట్నె్సతో లేడు. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నెట్స్లో తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఒకవేళ అశ్విన్ ఆడకపోతే.. ఆ స్థానాన్ని కుల్దీ్పతో భర్తీ చేయొచ్చు. బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్తోపాటు చటేశ్వర్ పుజార, రహానెతో టాపార్డర్ బలంగానే కనిపిస్తోంది. కానీ, విహారి దూరమవడంతో మిడిలార్డర్లో రిషభ్ పంత్ను దించే అవకాశాలున్నాయి. పూర్తి ఫిట్నె్సతో లేని పంత్.. కీపింగ్ చేయలేకపోతే అతడిని స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా తీసుకొని కీపర్గా సాహాకు బాధ్యతలు అప్పగించాలన్నది మేనేజ్మెంట్ యోచన. గాయపడిన జడేజా స్థానాన్ని సుందర్తో భర్తీ చేసే అవకాశాలున్నాయి.
పెద్దగా మార్పుల్లేకుండానే..
సిడ్నీలో గెలవాల్సిన మ్యాచ్ను డ్రా చేసుకొని తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆసీస్.. పెద్దగా మార్పుల్లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగనుంది. మేటి ఆటగాళ్లంతా అందుబాటులో ఉండడంతోపాటు గాబాలో తమకు ఘనమైన రికార్డుండడం కంగారూలకు అదనపు బలం. కమిన్స్, స్టార్క్, హాజెల్వుడ్, లియాన్తో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. బ్యాటింగ్పరంగా ఓపెనర్ పుకోవ్స్కీ గాయపడడంతో అతడి స్థానంలో హారి్సకు చోటుదక్కే అవకాశ ఉంది. లబుషేన్, స్మిత్ మంచి ఫామ్లో ఉండగా.. ఆల్రౌండర్గా గ్రీన్ రాణిస్తున్నాడు. ఆసీస్ సారథి పెయిన్ సత్తా చాటాల్సి ఉంది.
పిచ్
గాబా వికెట్లో బౌన్స్ ఎక్కువగా ఉండడంతో పేసర్లకు అదనపు ప్రయోజనం. అయితే, ఈ పిచ్ కొంతమేర స్పిన్నర్లకు కూడా సహకరించే అవకాశం ఉంది.
33
బ్రిస్బేన్ స్టేడియంలో ఇప్పటిదాకా 55 మ్యాచ్లాడిన ఆసీస్ 33సార్లు గెలిచింది. 8 మ్యాచ్ల్లో ఓడింది. 13 మ్యాచ్లను డ్రాగా ముగించింది. ఒక మ్యాచ్ టై అయింది.
6
భారత్ ఇక్కడ మొత్తం ఆరుసార్లు ఆడింది. అయితే, ఒక్కసారి కూడా గెలవలేదు. 2003లో ఒక మ్యాచ్ను డ్రా చేసుకొంది.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ, గిల్, పుజార, రహానె (కెప్టెన్), పంత్, సాహా (వికెట్ కీపర్), సుందర్, అశ్విన్/కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, నవ్దీప్ సైనీ, నటరాజన్.
ఆస్ట్రేలియా: వార్నర్, పుకోవ్స్కీ /మార్కస్ హారిస్, లబుషేన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, కామెరూన్ గ్రీన్, టిమ్ పెయిన్ (కెప్టెన్), కమిన్స్, స్టార్క్, లియాన్, హాజెల్వుడ్.