మహిళ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు బోణీ.. ఆసీస్ చిత్తు!

ABN , First Publish Date - 2020-02-21T22:22:36+05:30 IST

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు బోణీ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రారంభ

మహిళ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు బోణీ.. ఆసీస్ చిత్తు!

సిడ్నీ: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు బోణీ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో విజయఢంకా మోగించింది. 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్ల విజృంభణ ముందు ఆసీస్ బ్యాట్స్ విమెన్ మోకరిల్లక తప్పలేదు. ముఖ్యంగా పూనమ్ యాదవ్ ఆసీస్ బ్యాట్స్‌విమెన్‌ను వణికించింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా మరో బంతి మిగిలి ఉండగానే 115 పరుగులకు ఆలౌట్ అయింది.


భాతర బౌలర్లలో పూనమ్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, శిఖా పాండే 3, రాజేశ్వరి గైక్వాడ్ ఓ వికెట్ తీసి ఆసీస్ వెన్ను విరిచారు. ఆస్ట్రేలియా బ్యాట్స్ విమెన్‌లలో అలీసా హీలీ 51, ఆష్లీ గార్డ్‌నెర్ 34 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. మిగతా 9 మందీ కలిపి చేసిన పరుగులు 28 మాత్రమే. 


అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ 29, స్మృతి మంధాన 10, జెమీమా రోడ్రిగ్స్ 26, దీప్తి శర్మ 49 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2, వేదా కృష్ణమూర్తి 9 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో జెస్ జొనాసెన్ 2 వికెట్లు పడగొట్టగా, ఎలీస్ పెర్రీ, డెలిస్సా కిమిన్స్ చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2020-02-21T22:22:36+05:30 IST