మరోసారి భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు
ABN , First Publish Date - 2020-07-14T04:36:43+05:30 IST
న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు మంగళవారం ఉదయం జరగనున్నాయి. చుసూల్లో జరగనున్న ఈ చర్చల్లో భారత్ తరపున లెఫ్టెనెంట్ జనరల్ హర్దీప్ సింగ్ చర్చలు జరుపుతారు.
న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు మంగళవారం ఉదయం జరగనున్నాయి. చుసూల్లో జరగనున్న ఈ చర్చల్లో భారత్ తరపున లెఫ్టెనెంట్ జనరల్ హర్దీప్ సింగ్ చర్చలు జరుపుతారు. గతంలో మూడుసార్లు జరిగిన చర్చల్లోనూ భారత్కు ఆయనే నేతృత్వం వహించారు. మంగళవారం సమావేశంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గించేందుకు తీసుకుంటోన్న చర్యలపై చర్చిస్తారు. బలగాల ఉపసంహరణ ఏ స్థాయిదాకా వచ్చిందనే విషయంపై కూడా చర్చిస్తారు. జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకోవడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఆ తర్వాత చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించుకున్నాయి. ఎల్ఏసీ వెంబడి నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని సాదారణ స్థాయికి తీసుకొచ్చాయి.
మరోవైపు ఈ నెల 16, 17 తేదీల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేహ్లో హై సెక్యూరిటీ రివ్యూ మీటింగ్లో పాల్గొంటారు. ఎల్ఏసీ వెంబడి పరిస్థితిని సమీక్షిస్తారు. శ్రీనగర్లో కూడా రాజ్నాథ్ పర్యటించే అవకాశం ఉంది. కోర్ కమాండర్ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు.