మరో ఐదు ఓవర్ల ముందు డిక్లేర్ చేసి ఉండాల్సింది: వీవీఎస్ లక్ష్మణ్
ABN , First Publish Date - 2021-11-30T00:45:55+05:30 IST
ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రా కావడంపై టీమిండియా మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్..
కాన్పూరు: ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రా కావడంపై టీమిండియా మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. నాలుగో రోజు ఇండియా తన రెండో ఇన్నింగ్స్ను ఇంకొంత ముందుగా డిక్లేర్ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఫలితంగా నిన్న మరికొన్ని ఓవర్లు బౌలింగు చేసే అవకాశం లభించి ఉండేదని పేర్కొన్నాడు. చివరి రోజు చివరి వరుస ఆటగాళ్లు అద్భుతంగా ఆడడంతో కివీస్ ఈ మ్యాచ్ను డ్రా చేసుకోగలిగింది.
మ్యాచ్ అనంతరం ‘స్టార్ స్పోర్ట్స్’తో లక్ష్మణ్ మాట్లాడుతూ.. భారత్ తన రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడానికి 5 ఓవర్ల ముందే ఆ పని చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఎలాంటి వారికైనా చివరి కొన్ని ఓవర్లు చాలా కఠినంగా ఉంటాయన్నాడు. కాబట్టి నిన్న భారత్కు మరో ఐదు ఓవర్లు అదనంగా వేసే అవకాశం ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
ఐదో రోజు ఇండియన్ బౌలర్లు అద్భుతంగా రాణించారంటూ ప్రశంసలు కురిపించిన లక్ష్మణ్.. బ్యాటింగులో టాపార్డర్ వైఫల్యాన్ని ఎత్తిచూపాడు. తొలి ఇన్నింగ్స్లో భారత టాపార్డర్ బ్యాట్స్మెన్ 145 పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్లో 51 పరుగులు మాత్రమే చేశారని అన్నాడు. అయితే, బౌలర్లు మాత్రం తమ పని బ్రహ్మాండంగా చేశారని ప్రశంసించాడు.