వారంలో ఒలింపిక్స్ పూర్తి.. భారత్ ఎక్కడుందంటే..

ABN , First Publish Date - 2021-08-02T06:03:10+05:30 IST

విశ్వక్రీడలైన టోక్యో ఒలింపిక్స్-2021 మరో వారంలో ముగియనున్నాయి. ఆగస్టు 8తో ముగియనున్న ఈ పోటీల్లో..

వారంలో ఒలింపిక్స్ పూర్తి.. భారత్ ఎక్కడుందంటే..

విశ్వక్రీడలైన టోక్యో ఒలింపిక్స్-2021 మరో వారంలో ముగియనున్నాయి. ఆగస్టు 8తో ముగియనున్న ఈ పోటీల్లో 205కు పైగా దేశాలు.. 11వేలకు పైగా క్రీడాకారులు పతకాల వేటలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఈ పోటీల్లో ఇప్పటివరకు 76 దేశాలు లేదా ఒలింపిక్ జాతీయ కమిటీలు పతకాలు సాధించాయి. ఇందులో చైనా మొట్టమొదటి స్థానంలో కొనసాగుతోంది. 24 బంగారు పతకాలు, 14 రజత పతకాలు, 13 కాంస్యాలతో మొత్తం 51 పతకాలు సాధించి టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇక 20 గోల్డ్, 23 సిల్వర్, 16 బ్రాంజ్ మెడల్స్‌తో అమెరికా రెండో స్థానంలో ఉంది. 17 పసిడి, 5 రజత, 9 కాంస్య పతకాలతో మొత్తం 31 పతకాలు సాధించి మూడో స్థానంలో జపాన్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా కూడా మొత్తంగా 31 పతకాలే సాధించినా.. బంగారు పతకాలు 14 మాత్రమే సాధించడంతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే రజత పతకాలు 3 సాధించగా.. కాంస్యాల్లో మాత్రం జపాన్ కంటే ఎక్కువగా 14 పతకాలను ఆసీస్ సాధించింది.


భారత్ విషయానికి వస్తే.. నిన్నటితో పోల్చితే ఓ స్థానం మెరుగుపరుచుకుని 59వ స్థానానికి చేరింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకం సాధించి తొలి పతకాన్ని భారత్‌కు కట్టబెట్టగా.. షటిల్లో‌ పీవీ సింధు కాంస్య పతకం సాధించడంతో భారత్ ఖాతాలో రెండో పతకం నమోదైంది. ఇక భారత్‌తో పాటు క్యూబా, పోర్చుగల్, సాన్ మరినో, ఉగాండాలు కూడా ఓ రజతం, ఓ కాంస్యం సాధించి 59వ ర్యాంకులో కొనసాగుతున్నాయి.

Updated Date - 2021-08-02T06:03:10+05:30 IST