సెమీస్ ఓటమి తర్వాత హాకీ జట్టుకు మోదీ ఫోన్.. జట్టుతో ఏం మాట్లాడారో చెప్పిన మన్‌ప్రీత్

ABN , First Publish Date - 2021-08-05T20:37:47+05:30 IST

పురుషుల హాకీ సెమీస్‌లో బెల్జియం చేతిలో భారత జట్టు 2-5 తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా స్వర్ణం ఆశలు చేజారాయి

సెమీస్ ఓటమి తర్వాత హాకీ జట్టుకు మోదీ ఫోన్.. జట్టుతో ఏం మాట్లాడారో చెప్పిన మన్‌ప్రీత్

టోక్యో:  ఒలింపిక్స్ పురుషుల హాకీ సెమీస్‌లో బెల్జియం చేతిలో భారత జట్టు 2-5 తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా స్వర్ణం ఆశలు చేజారాయి. ఆ సమయంలో నిరాశలో కూరుకుపోయిన జట్టుకు ఫోన్ చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జట్టులో బోల్డంత ధైర్యాన్ని నింపారు. కాంస్య పతకం కోసం మరో గేమ్ మిగిలే ఉండడంతో అందుకు అవసరమైన ఉత్సాహాన్ని వారిలో నింపారు. జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 


కాంస్య పతకం కోసం జర్మనీతో జరిగిన పోరులో ఈ ఉదయం భారత జట్టు 5-4తో విజయం సాధించిన తర్వాత మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి తాము కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నామని పేర్కొన్నాడు. సెమీ ఫైనల్‌లో ఓటమి తర్వాత ప్రధాని తమకు ఫోన్ చేశారని, జట్టు సభ్యులందరితోనూ మాట్లాడారని చెప్పాడు. సెమీస్‌లో ఓటమికి బాధపడాల్సిన అవసరం లేదని, తర్వాతి మ్యాచ్ కోసం సన్నద్ధం కావాలని చెప్పారని గుర్తు చేసుకున్నాడు. దేశం మొత్తం మీతోనే ఉందని ధైర్యం నూరిపోశారని మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. నేడు జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం మోదీ మరోమారు ఫోన్ చేసి అభినందించారని, మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తోందని అన్నారని మన్‌ప్రీత్ పేర్కొన్నాడు.  

Updated Date - 2021-08-05T20:37:47+05:30 IST