ఆఫ్ఘన్‌ను ఉగ్రవాదులు అరాచకానికి వాడుకోరాదు : భారత్

ABN , First Publish Date - 2021-08-24T22:14:07+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిణామాలు దాని పొరుగు దేశాలకు

ఆఫ్ఘన్‌ను ఉగ్రవాదులు అరాచకానికి వాడుకోరాదు : భారత్

జెనీవా : ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిణామాలు దాని పొరుగు దేశాలకు సవాళ్ళు విసరబోవని ఆశిస్తున్నట్లు భారత దేశం తెలిపింది. ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ (యూఎన్‌హెచ్ఆర్‌సీ) ప్రత్యేక సమావేశంలో ఈ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో మానవ హక్కుల పరిరక్షణ, అభివృద్ధిపై ఈ సమావేశం జరిగింది. 


ఐక్య రాజ్య సమితికి భారత దేశ శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే ఈ సమావేశంలో మాట్లాడుతూ, లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘన్ భూభాగాన్ని ఇతర దేశాల శాంతి, సుస్థిరతలకు ముప్పు కలిగే విధంగా వాడుకునే అవకాశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రజల ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతుండటంపై ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారని చెప్పారు. హుందాగా జీవించే హక్కుకు గౌరవం లభిస్తుందా? లేదా? అని ఆఫ్ఘన్లు ఆందోళన చెందుతున్నారన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్-భారత్ మధ్య వేలాది సంవత్సరాల స్నేహం ఉందని తెలిపారు. ఇరు దేశాల ప్రజల మధ్య బలమైన సంబంధాల పునాదులపై ఈ మైత్రి ఆధారపడిందన్నారు. శాంతియుత, సౌభాగ్యవంతమైన, ప్రగతిశీల ఆఫ్ఘనిస్థాన్ కోసం భారత దేశం ఎల్లప్పుడూ నిలిచిందన్నారు. ఆఫ్ఘన్ మిత్రుల ఆకాంక్షలు నెరవేరడం కోసం సహాయం చేయడానికి భారత దేశం సిద్ధంగా ఉంటుందన్నారు. 


Updated Date - 2021-08-24T22:14:07+05:30 IST