పసిడి కోసం పట్టుదలగా..
ABN , First Publish Date - 2021-07-24T06:55:56+05:30 IST
ప్రస్తుత ఫామ్ ప్రకారం షూటింగ్ బరిలో ఉన్న 15 మందికీ పతకం సాధించగల నైపుణ్యం ఉంది.
నేటి నుంచి మన ‘పతక’ క్రీడలు
ఒలింపిక్స్లో భారత్కు పతక అవకాశాలుండే క్రీడలు శనివారం నుంచి
జరుగనున్నాయి. వాటి వివరాలు:
షూటింగ్: ప్రస్తుత ఫామ్ ప్రకారం షూటింగ్ బరిలో ఉన్న 15 మందికీ పతకం సాధించగల నైపుణ్యం ఉంది. తొలిరోజు 10మీ. ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ.. మహిళల్లో అపూర్వి, ఎలవెనిల్ పోటీపడుతున్నారు.
హాకీ: భారత పురుషులు, మహిళల హాకీ జట్లు కూడా శనివారం నుంచే పతకం కోసం రేసును ఆరంభించనున్నాయి. ప్రపంచ టీమ్ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉన్న భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్ను న్యూజిలాండ్ (8వ ర్యాంకు)తో ఆడనుంది. అయితే గ్రూప్ ‘ఎ’లో భారత్తో పాటు ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా, పటిష్ట ఆస్ట్రేలియా కూడా ఉండడం కాస్త ప్రతికూలం. మహిళల హాకీ జట్టు తమ తొలి మ్యాచ్లోనే వరల్డ్ నెంబర్వన్ నెదర్లాండ్స్ను ఢీకొనబోతోంది.
బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్లో సాయి ప్రణీత్తో పాటు డబుల్స్లో చిరాగ్-సాత్విక్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
టేబుల్ టెన్నిస్: మూడేళ్ల క్రితం జరిగిన ఆసియా గేమ్స్లో భారత టేబుల్ టెన్నిస్ తొలిసారి పతకాలు సాధించింది. అదే జోరును ఈ మెగా వేదికపై చూపాలనుకుంటున్నారు. కానీ శరత్ కమల్-మనికా బాత్రా జోడీకి తొలి రౌండ్లోనే నెంబర్ వన్ ర్యాంకర్స్ చైనీస్ తైపీ జంట ఎదురైంది. సింగిల్స్లోనూ శరత్ కమల్, సాథియన్కు కఠిన డ్రా ఉంది.
బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్: బాక్సింగ్లో తొలి రోజు శనివారం భారత్ నుంచి కేవలం వికాస్ క్రిషన్ (69కేజీ) రింగ్లోకి దిగనున్నాడు. ఇక వెయిట్లిఫ్టింగ్ బరిలో ఏకైక భారత లిఫ్టర్ మీరాబాయి చాను (49కేజీ) రియో గేమ్స్ పేలవ ప్రదర్శనను మరిచిపోవాలనుకుంటోంది.