క్వార్టర్స్లో భారత్
ABN , First Publish Date - 2021-10-13T06:51:32+05:30 IST
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సీనియర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు టోర్నీకి దూరమైనా భారత టీనేజర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు.
అర్హస్ (డెన్మార్క్): ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సీనియర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు టోర్నీకి దూరమైనా భారత టీనేజర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. మంగళవారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో టీమిండియా 4-1 స్కోరుతో స్కాట్లాండ్పై ఘన విజయం సాధించింది. తొలి సింగిల్స్లో మాళవిక బాన్సోడ్ 13-21, 9-21తో క్రిస్టీ గిల్మోర్ చేతిలో ఓడింది. అయితే రెండో సింగిల్స్లో అదితి భట్ 21-14, 21-8తో రేచల్ సుగ్డెన్పై గెలుపొంది 1-1తో స్కోరు సమం చేసింది. తర్వాత తొలి డబుల్స్లో తనీషా క్రాస్టో-రుతుపర్ణా పాండా జోడీ 21-11, 21-8తో జూలీ మ్యాక్పర్సన్-సియారా టోరెన్స్ జంటను ఓడించడంతో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. మూడో సింగిల్స్లో తస్నిమ్ మీర్ 21-15, 21-6తో లారెన్ మిడిల్టన్పై గెలిచింది. ఆఖరి, రెండో డబుల్స్లో పుల్లెల గాయత్రి-త్రిషా జోలీ జంట 21-8, 19-21, 21-10తో క్రిస్టీ గిల్మోర్-ఎలియనోర్ ఓడోనెల్ ద్వయంపై నెగ్గడంతో భారత్ 4-1తో మ్యాచ్ను ముగించింది. బుధవారం జరగనున్న చివరి గ్రూప్-బి మ్యాచ్లో పటిష్ట థాయ్లాండ్తో టీమిండియా తలపడనుంది.