పాక్, చైనాలు రెండు వైపుల నుంచీ మాటు వేసినా మేం రెడీ

ABN , First Publish Date - 2021-10-05T21:39:19+05:30 IST

చైనా, పాకిస్థాన్ చెరొక వైపు నుంచి భారత్‌పై దాడి చేసినా

పాక్, చైనాలు రెండు వైపుల నుంచీ మాటు వేసినా మేం రెడీ

న్యూఢిల్లీ : చైనా, పాకిస్థాన్ చెరొక వైపు నుంచి భారత్‌పై దాడి చేసినా, దీటుగా ఎదుర్కొనేందుకు భారత వాయు సేన (ఐఏఎఫ్)  సిద్ధంగా ఉన్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి చెప్పారు. చైనా మౌలిక సదుపాయాల పెరుగుదల ప్రభావం భారత దేశ పోరాట సంసిద్ధతపై ఉండబోదని తెలిపారు. చైనా, పాకిస్థాన్ మధ్య భాగస్వామ్యం పట్ల భయపడనక్కర్లేదన్నారు. 


ఈ నెల 8న భారత వాయు సేన 89వ వార్షికోత్సవాల నేపథ్యంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి మీడియాతో మాట్లాడారు. వాయు సేన, సైన్యం, నావికా దళాల సామర్థ్యాలను ఏకీకృతం చేసి, సమన్వయంతో ఉపయోగించుకోవడానికి ఐఏఎఫ్ కట్టుబడి ఉందన్నారు. త్రివిధ దళాల సమష్టి ప్రణాళిక, కార్యకలాపాల నిర్వహణ ఫలితంగా మన నికర పోరాట సామర్థ్యం గరిష్ఠ స్థాయికి పెరుగుతుందన్నారు. ప్రతి దళానికి ఉన్న బలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, దీనిపై సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు. 


రఫేల్ యుద్ధ విమానాలు, అపాచీ జెట్స్, కొత్త ఆయుధాలను సమకూర్చడం వల్ల ఐఏఎఫ్‌కుగల దూకుడుగా దాడి చేసే సామర్థ్యం మరింత బలోపేతమైందని తెలిపారు. సైబర్ దాడుల నుంచి భారత దేశ మౌలిక సదుపాయాలను కాపాడటానికి తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. చైనా, పాకిస్థాన్ మధ్య భాగస్వామ్యం గురించి భయపడనక్కర్లేదని, వెస్టర్న్ టెక్నాలజీ పాకిస్థాన్ నుంచి చైనాకు వెళ్తుండటం ఒక్కటే ఆందోళనకరమని తెలిపారు. టిబెట్ రీజియన్‌లో మూడు ఎయిర్‌బేస్‌లలో చైనా తన దళాలను మోహరిస్తోందన్నారు. అయినప్పటికీ చైనా సామర్థ్యం బలహీనంగానే ఉంటుందన్నారు. 



Updated Date - 2021-10-05T21:39:19+05:30 IST