వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్దే కీలక పాత్ర: బిల్ గేట్స్
ABN , First Publish Date - 2020-09-16T11:59:32+05:30 IST
కొవిడ్ మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్ తయారీలో, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆ వ్యాక్సిన్ను పంపిణీ చేయడంలో.. భారత్ పాత్ర ఎంతో కీలకమని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనా మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సిన్ తయారీలో ఆరు సంస్థలు ప్రస్తుతం ముందుండగా...
మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్గేట్స్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: కొవిడ్ మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్ తయారీలో, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆ వ్యాక్సిన్ను పంపిణీ చేయడంలో.. భారత్ పాత్ర ఎంతో కీలకమని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనా మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సిన్ తయారీలో ఆరు సంస్థలు ప్రస్తుతం ముందుండగా.. వాటిలో కనీసం మూడు సంస్థల వ్యాక్సిన్లు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాన్ని పెద్ద ఎత్తున తయారుచేసే గురుతర బాధ్యతను అద్భుతంగా చేయగల దిగ్గజ సంస్థలు భారత్లోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచమంతా భారత్వైపు చూస్తోందన్నారు. భారత కంపెనీలైన సీరమ్ ఇన్స్టిట్యూట్, బయో ఈ, భారత్ బయోటెక్ వంటి సంస్థల సామర్థ్యాన్ని గురించి బిల్గేట్స్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఇదేనని అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలోని అతి పెద్ద దాతృత్వ సంస్థల్లో ఒకటైన బిల్గేట్స్ అండ్ మెలిండా ఫౌండేషన్.. భారత్లో వ్యాక్సిన్ తయారీకి సంబంధించి సీరమ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్.. ఇలా ఎవరు ముందుగా వ్యాక్సిన్ తయారుచేసినా దాన్ని భారత్లో తయారుచేసేలా చర్చలు జరుపుతున్నామని గేట్స్ చెప్పారు.