ఆట అదిరితేనే..

ABN , First Publish Date - 2021-03-18T10:01:08+05:30 IST

పొట్టి క్రికెట్‌లో నెంబర్‌ వన్‌ ఇంగ్లండ్‌తో కీలక పోరుకు కోహ్లీసేన సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నాలుగో మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శన చేయక తప్పదు...

ఆట అదిరితేనే..

  • గెలిస్తే రేసులో...ఇంగ్లండ్‌తో భారత్‌ నాలుగో టీ20 నేడు
  • రాత్రి 7 గంటల నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌లో..

తొలి టీ20లో చిత్తుగా ఓటమి..రెండో మ్యాచ్‌లో పూర్తిగా భిన్నమైన ప్రదర్శనతో ప్రత్యర్థిపై ఘన విజయం..మళ్లీ మూడో టీ20కి వచ్చేసరికి ఆట గాడి తప్పింది.. ఇదీ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ మొదటి మూడు మ్యాచ్‌లలో భారత్‌ ఆటతీరు..అలాగే మూడింటిలోనూ ఒక్కరు లేదా ఇద్దరే బ్యాట్స్‌మెన్‌ సత్తా చాటారు.. తొలి పోరులో శ్రేయాస్‌ అయ్యర్‌, రెండో దానిలో ఇషాన్‌ కిషన్‌, కెప్టెన్‌ కోహ్లీ, గత మ్యాచ్‌లో విరాట్‌ మాత్రమే రాణించారు..సమష్టి క్రీడ క్రికెట్‌లో ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్‌ లేదా బౌలర్లో అంచనాలకు అందుకొంటే సరిపోదు..ఈ నేపథ్యంలో గురువారం ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టీ20లో టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడితేనే సిరీస్‌ రేసులో నిలుస్తుంది..లేదంటే సిరీస్‌ గల్లంతే.


అహ్మదాబాద్‌: పొట్టి క్రికెట్‌లో నెంబర్‌ వన్‌ ఇంగ్లండ్‌తో కీలక పోరుకు కోహ్లీసేన సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నాలుగో మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శన చేయక తప్పదు. ఇందుకు ముఖ్యంగా..టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేయాలన్న ఆలోచననుంచి టీమిండియా బయటపడాలి. ఎందుకంటే జరిగిన మూడు మ్యాచ్‌ల్లో టాస్‌ నెగ్గిన జట్టు అలవోకగా లక్ష్యాన్ని ఛేదించగలగడమే! అయితే మొదట బ్యాటింగ్‌ అయినా, ఛేదన అయినా అద్భుతంగా ఆడాల్సి ఉంటుందని కెప్టెన్‌ కోహ్లీ తరచుగా చెబుతుంటాడు. మరికొద్ది నెలల్లో స్వదేశంలో టీ20 వరల్డ్‌ కప్‌ జరగనున్న నేపథ్యంలో తొలుత బ్యాటింగా, బౌలింగా అన్న విషయంతో సంబంధం లేకుండా విరాట్‌ బృందం విజృంభించాల్సిందే. ఈ సిరీ్‌సలో జరిగిన మూడు పోటీల్లో రెండింటిలో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఓటమి చవిచూడడం గమనార్హం. ఈ రెండు మ్యాచ్‌ల్లో పవర్‌ ప్లేలో భారీగా పరుగులు చేయడంలో జట్టు విఫలమైంది. మార్క్‌, ఆర్చర్‌ మెరుపు వేగంతో చేస్తున్న బౌలింగ్‌తో మొదటి ఆరు ఓవర్లలో పరుగులు సాధించడం టీమిండియాకు గగనమవుతోంది. కేఎల్‌ రాహుల్‌ పూర్తిగా నిరాశపరచడం జట్టును దెబ్బ తీస్తోంది. అయినా కోహ్లీ మాత్రం అతడివైపే మొగ్గు చూపుతున్నాడు. కానీ, చావోరేవోగా మారిన ఈ మ్యాచ్‌లో రాహుల్‌ను ఆడిస్తారా అన్నది సందేహమే. 


తుది జట్టులో మరో ఆల్‌రౌండర్‌ ?

మూడో టీ20 అనంతరం కోహ్లీ మాటలను బట్టిచూస్తే హార్దిక్‌, సుందర్‌తోపాటు మూడో ఆల్‌రౌండర్‌కు జట్టులో చోటు కల్పించినా ఆశ్చర్యం లేదు. దాంతో రాహుల్‌ తెవాటియా, అక్షర్‌ పటేల్‌లో ఒకరికి స్థానం లభించే చాన్సుంది. ఇకపోతే రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ బ్యాటింగ్‌ గాడిలో పడడంతో భారత్‌ ఓ మోస్తరు స్కోరు సాధించినా.. బౌలర్లు తేలిపోయారు. జట్టు నెంబర్‌ వన్‌ స్పిన్నర్‌ చాహల్‌ ధారాళంగా పరుగులిస్తున్నాడు. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న హార్దిక్‌ ఇప్పటివరకు వికెట్‌ తీయలేకపోయాడు. భువనేశ్వర్‌ పరుగులను నియంత్రిస్తున్నా కీలక తరుణాల్లో వికెట్లు పడగొట్టాల్సి ఉంది. ఇక ఆఫ్‌స్పిన్నర్‌ సుందర్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. 1-2తో వెనుకంజలో ఉన్నా నాలుగో మ్యాచ్‌కు భారత జట్టులో పెద్దగా మార్పులుండే అవకాశాలు లేవు.



ఆత్మవిశ్వాసంలో ఇంగ్లండ్‌

గత మ్యాచ్‌ అందుకున్న పెద్ద విజయంతో ఇంగ్లండ్‌లో ఆత్మవిశ్వాసం ఉరకలేస్తోంది. ఎదురు దాడే లక్ష్యంగా జోస్‌ బట్లర్‌  భారత బౌలర్లలో గుబులు రేపుతున్నాడు. టెస్ట్‌లలో ఘోరంగా విఫలమైన బెయిర్‌ స్టో గత మ్యాచ్‌ద్వారా మళ్లీ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు శుభసూచకం. టీ20లలో నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలాన్‌ కూడా కుదురుకుంటే ఇంగ్లండ్‌కు తిరుగుండబోదు. 


జట్లు (అంచనా)

భారత్‌: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌/రాహుల్‌, చాహల్‌, భువనేశ్వర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌.

ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), జాసన్‌ రాయ్‌, బట్లర్‌, మలాన్‌, బెన్‌ స్టోక్స్‌, బెయిర్‌ స్టో, సామ్‌ కర్రాన్‌, జోర్డాన్‌, ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ ఉడ్‌.



Updated Date - 2021-03-18T10:01:08+05:30 IST