కోవిడ్-19 వ్యాక్సిన్ సరఫరాపై నేపాల్కు భారత్ గట్టి భరోసా
ABN , First Publish Date - 2021-01-17T23:36:07+05:30 IST
భారత దేశంలో తయారైన జంట కోవిడ్-19 వ్యాక్సిన్లను ముందుగా
న్యూఢిల్లీ : భారత దేశంలో తయారైన జంట కోవిడ్-19 వ్యాక్సిన్లను ముందుగా స్వీకరించే దేశాల్లో నేపాల్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గట్టి భరోసా ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ల సరఫరా షెడ్యూలును వచ్చే వారం ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇండో-నేపాల్ జాయింట్ కమిషన్ సమావేశంలో పాల్గొన్న నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గియావలికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ హామీ ఇచ్చింది.
గియావలి మూడు రోజుల భారత్ పర్యటన శనివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్లతో చర్చలు జరిపారు. ప్రభుత్వ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, నేపాల్లో ఫ్రంట్లైన్ వర్కర్స్కు కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చేందుకు చేస్తున్న ఏర్పాట్లపై ప్రదీప్ కుమార్ గియావలి, ఎస్ జైశంకర్ చర్చించారు. భారతీయ వ్యాక్సిన్లకు నేపాల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతి మంజూరు చేసినట్లు గియావలి తెలిపారు. వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన వైమానిక, రోడ్డు రవాణా సేవలను క్రమంగా పునరుద్ధరించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. రెగ్జాల్-ఖాట్మండు రైల్వే లైన్ కోసం సర్వేను వేగవంతం చేయాలని నిర్ణయించాయి.
ఇదిలావుండగా, భారత దేశం తన మిత్ర దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను సరఫరా చేయడంపై దృష్టి సారించింది. పొరుగు దేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవులు, నేపాల్లకు ఎమర్జెన్సీ అవసరాలను తీర్చేందుకు వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు షెడ్యూలును రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.