భారత్‌లో 24 గంటల వ్యవధిలో ఇన్ని కరోనా కేసులూ, మరణాలా..!

ABN , First Publish Date - 2020-06-05T16:29:10+05:30 IST

భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకీ ప్రతాపాన్ని చూపుతోంది. లాక్‌డౌన్‌ను కేవలం కంటైన్మెంట్ జోన్లకే...

భారత్‌లో 24 గంటల వ్యవధిలో ఇన్ని కరోనా కేసులూ, మరణాలా..!

భారత్‌లో గత 24 గంటల్లో 9,851 కరోనా కేసులు, 273 కరోనా మరణాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకీ ప్రతాపాన్ని చూపుతోంది. లాక్‌డౌన్‌ను కేవలం కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేయడం, ఆంక్షలను సడలించి ప్రజా రవాణాకు పూర్తిగా ఆస్కారం ఇవ్వడంతో కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఊర్లకు తరలివెళుతున్న వలస కార్మికుల్లో కొందరికి, దేశీయ విమానాల్లో రాకపోకలు సాగిస్తున్న వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అవుతుండటంతో దేశంలో కొంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.


భారత్‌లో గడచిన 24 గంటల్లో అత్యధికంగా 9,851 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. కరోనా మరణాల సంఖ్య కూడా మన దేశంలో అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. గత 24 గంటల్లో భారత్‌లో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 273 మంది మరణించినట్లు కేంద్రం ప్రకటించింది.


24 గంటల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుతున్న తీరును పరిశీలిస్తే రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదు కావడానికి ఎక్కువ వ్యవధి పట్టేలా కనిపించడం లేదు. అయితే.. రికవరీ రేటు కూడా రోజురోజుకూ మెరుగవుతుండటం కొంత ఊరట కలిగించే విషయం. భారత్‌లో ఇప్పటివరకూ 1,09,462 మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,770 కాగా.. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 1,10,960. భారత్‌లో ఇప్పటివరకూ 6348 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.



Updated Date - 2020-06-05T16:29:10+05:30 IST