చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
ABN , First Publish Date - 2020-04-10T14:58:04+05:30 IST
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) అజెండాలో జమ్మూ కశ్మీర్ అంశానికి ‘అత్యధిక ప్రాధాన్యత’ ఇవ్వాలంటూ...
న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) అజెండాలో కశ్మీర్ అంశానికి ‘అత్యధిక ప్రాధాన్యత’ ఇవ్వాలంటూ చైనా ప్రతిపాదించడాన్ని భారత్ తీవ్ర స్థాయిలో తిప్పికొట్టింది. జమ్మూ కశ్మీర్ అంశం భారత అంతర్గత వ్యవహారమని మరోసారి తేల్చిచెప్పింది. ‘‘ఐక్య రాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధి జమ్మూ కశ్మీర్పై చేసిన సూచనలను తిరస్కరిస్తున్నాం. ఈ అంశంపై భారత్ వైఖరి ఏంటో చైనాకి తెలుసు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. జమ్మూ కశ్మీర్కి సంబంధించిన వ్యవహారాలు కూడా భారత్లో అంతర్భాగమే...’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ సహా భారత పౌరుల జీవితాలను ప్రభావితం చేస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని గుర్తించి, ఖండించాలని చైనాకు హితవు పలికింది.
కాగా దీనికి ముందు చైనా పాకిస్తాన్కు వంతపాడుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎన్ఎస్సీ అజెండాలో కశ్మీర్ అంశానికి ‘‘అత్యధిక ప్రాధాన్యత’’ ఇవ్వాలంటూ మార్చి 10న పాకిస్తాన్ తమకు రాసిన లేఖపై ‘‘వెంటనే’’ స్పందించామని పేర్కొంది. ఈ విషయాన్ని యూఎన్ఎస్సీలో లేవనెత్తుతామని చెప్పుకొచ్చింది. దీనిపై ఎలాంటి సమావేశం జరక్కుండానే ఐరాసలోని చైనా రాయబారి ఝంగ్ జున్ ఏకంగా పాకిస్తాన్ లేఖను భద్రతా మండలి అధికారిక తీర్మానంలాగా ప్రచారం చేశారు. ఓ వైపు కొవిడ్-19పై యూఎస్ఎస్సీలో సమావేశం ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనా నాయకత్వం.. పాకిస్తాన్కు మాత్రం భుజం కలిపేందుకు ముందుకు రావడం గమనార్హం. వాస్తవానికి కొవిడ్-19పై ఐరాస భద్రతా మండలిలో చర్చ జరగడం చైనాకి ఇష్టం లేదనీ.. అదే జరిగితే వైరస్ వ్యాప్తిపై మరిన్ని నిజాలు బయటికి వస్తాయిని డ్రాగన్ భయపడుతోందని యూఎన్ఎస్సీ సభ్యదేశాలు భావిస్తున్నాయి.