Under 19 world cup: టీమిండియా బోణి!

ABN , First Publish Date - 2022-01-16T14:18:42+05:30 IST

అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత కుర్రాళ్లు బోణి కొట్టారు.

Under 19 world cup: టీమిండియా బోణి!

గయానా: అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత కుర్రాళ్లు బోణి కొట్టారు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో యువభారత్‌ సత్తా చాటింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన యశ్ ధూల్ సారథ్యంలోని భారత జట్టు 46.5 ఓవర్లలో 232 పరుగులు చేసింది. అనంతరం 233 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 45.4 ఓవర్లలో కేవలం 187 పరుగులకే కుప్పకూలింది. దీంతో యువభారత్ 45 పరుగుల తేడాతో గెలిచి అండర్‌-19 వరల్డ్‌కప్‌లో బోణి కొట్టింది. భారత బౌలర్లలో విక్కీ ఓత్సవల్ 5 వికెట్లు, రాజ్ భవా 4 వికెట్లు తీసి సఫారీలను కుప్పకూల్చారు. 


ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రఘువంశీ(05), హర్నూర్ సింగ్(01) సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. అయితే, తెలుగు కుర్రాడు రషీద్(31), కెప్టెన్ యశ్ ధూల్(82), కౌశల్ తాంబే(35), నిషంత్ సింధు(27) రాణించడంతో భారత్ పోరాడే స్కోర్ సాధించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో దెవాల్డ్‌ బ్రెవిస్‌ అర్ధశతకం (65) చేయగా.. కెప్టెన్ జార్జ్‌ వాన్‌ హీర్‌డెన్‌ (36) పరుగులతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో దక్షిణాఫ్రికా కేవలం 187 పరుగులకే ఆలౌట్ అయింది. ఐదు వికెట్లతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విక్కీ 'మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్‌'గా నిలిచారు.



Updated Date - 2022-01-16T14:18:42+05:30 IST