ఇండియా వర్సెస్ న్యూజిలాండ్.. ఆధిపత్యం ఎవరిదంటే?
ABN , First Publish Date - 2021-06-17T22:48:51+05:30 IST
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య రేపు (శుక్రవారం) సౌతాంప్టన్లో
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య రేపు (శుక్రవారం) సౌతాంప్టన్లో ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండేళ్ల పాటు జరిగిన తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్కు చేరాయి. కరోనా మహమ్మారి రాకముందు వరకు ఈ జాబితాలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగగా ఆ తర్వాత సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లలో విజయం సాధించిన భారత్ ఎట్టకేలకు ఫైనల్కు చేరుకుంది. న్యూజిలాండ్ అంతకుముందే ఫైనల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. రేపు పైనల్స్ జరగనున్న నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ముఖాముఖిగా జరిగిన మ్యాచుల్లో ఎవరిది పైచేయో ఓ లుక్కేద్దాం.
భారత్-న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు 59 టెస్టు మ్యాచ్లు జరిగాయి. వీటిలో 21 మ్యాచుల్లో భారత జట్టు విజయం సాధించింది. న్యూజిలాండ్ 12 విజయాలతో సరిపెట్టుకుంది. 26 మ్యాచ్లు డ్రా అయ్యాయి. మొత్తంగా ఇరు జట్లు 21 సిరీస్లు ఆడాయి. టీమిండియా 11, న్యూజిలాండ్ ఆరింటిలో విజయం సాధించాయి. నాలుగు సిరీస్లు డ్రాగా ముగిశాయి. ఏ రకంగా చూసినా కివీస్ కంటే భారత్దే పైచేయిగా ఉంది. అయితే, తటస్థ వేదికపై ఇరు జట్లు ముఖాముఖిగా తలపడడం ఇదే తొలిసారి. ఇటీవల భారత జట్టు 15 మ్యాచులు ఆడితే ఏడింటిలో విజయం సాధించింది. రేపటి మ్యాచ్లో ఇరు జట్లు ఇప్పటికే 15 మందితో కూడిన జట్లను ప్రకటించాయి.