ముగిసిన భారత్ పోరు
ABN , First Publish Date - 2021-01-16T06:48:12+05:30 IST
యోనెక్స్ థాయ్లాండ్ ఓపెన్లో సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ ప్రీక్వార్టర్స్లోనే వెనుదిరగడంతో టోర్నీలో భారత్ పోరు ముగిసింది...
- థాయ్లాండ్ ఓపెన్ నుంచి సైనా, శ్రీకాంత్ అవుట్
బ్యాంకాక్: యోనెక్స్ థాయ్లాండ్ ఓపెన్లో సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ ప్రీక్వార్టర్స్లోనే వెనుదిరగడంతో టోర్నీలో భారత్ పోరు ముగిసింది. మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో సైనా 23-21, 14-21, 16-21తో థాయ్లాండ్ షట్లర్ బుసానన్ ఓంగ్బారుపాంగాన్ చేతిలో పోరాడి ఓడింది. ప్రపంచ 12వ ర్యాంకరైన బుసానన్ చేతిలో సైనాకిది వరుసగా నాలుగో పరాజయం. పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్లో ఆడాల్సిన శ్రీకాంత్.. కుడికాలి పిక్క కండరం పట్టేయడంతో ప్రత్యర్థి లీ జి జియా (మలేసియా)కు వాకోవర్ ఇచ్చి టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. పురుషుల డబుల్స్ రెండోరౌండ్లో సాత్విక్-చిరాగ్ జోడీ 19-21, 17-21తో మలేసియాకు చెందిన మహ్మద్ అసాన్-హెండ్రా సెతియాన్ జంట చేతిలో ఓడింది. మిక్స్డ్లోనూ నిరాశపరుస్తూ సాత్విక్-అశ్విని ద్వయం 12-21, 17-21తో హాంకాంగ్ జోడీ చాంగ్ టక్-వింగ్ చేతిలో ఓటమిపాలైంది. సింధు, సాయి ప్రణీత్ తొలిరౌండ్లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.