అమెరికాలో భారతీయుడికి అరుదైన పురస్కారం !

ABN , First Publish Date - 2020-10-29T20:52:18+05:30 IST

ప్రముఖ భారతీయ అమెరికన్ పారిశ్రామిక వేత్త డా. దినేష్ సీ పటేల్‌.. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అందించిన విశిష్ట సేవలకు గాను అరుదైన పురస్కారం దక్కింది.

అమెరికాలో భారతీయుడికి అరుదైన పురస్కారం !

వాషింగ్టన్: ప్రముఖ భారతీయ అమెరికన్ పారిశ్రామిక వేత్త డా. దినేష్ సీ పటేల్‌.. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అందించిన విశిష్ట సేవలకు గాను అరుదైన పురస్కారం దక్కింది. బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ రంగంలో పటేల్ సేవలకు గుర్తింపుగా ఉతా గవర్నర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో రాష్ట్రానికి విశిష్ట సేవలను అందించిన వారి కృషికి గుర్తింపుగా 1987 నుంచి అర్హులైన గ్రహీతలకు ఉతా ప్రభుత్వం 'గవర్నర్ మెడల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ' పురస్కారం అందిస్తోంది. దీనిలో భాగంగానే గత 40 ఏళ్లుగా ఈ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న పటేల్‌ను బుధవారం ఈ అవార్డుతో సత్కరించింది. 


40 ఏళ్ల క్రితం ఉతా వెళ్లిన పటేల్ అక్కడే స్థిరపడ్డారు. బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ రంగంలో పటేల్ ఎన్నో ఆవిష్కరణలు చేశారు. అతని కృషి ఫలితంగా ఈ రంగంలో ఆర్థిక విజయాన్ని సాధించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది జీవితాలను మెరుగుపరిచింది. 1985లో ఆయన థెరాటెక్ అనే బయోటెక్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు అధ్యక్షుడిగా, సీఈఓగా పనిచేసిన పటేల్ విజయవంతంగా నడిపించారు. 1999లో ఈ సంస్థను వాట్సన్ ఫార్మాస్యూటికల్స్ ఏకంగా 350 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం విశేషం. థెరాటెక్ కంటే ముందే ఆయన సాలస్ థెరప్యూటిక్స్ అనే సంస్థను స్థాపించారు. ఇది యాంటీ సెన్స్ ఫార్మాస్యూటికల్స్‌ను అభివృద్ధి చేసే బయోటెక్నాలజీ సంస్థ. ఆ తర్వాత కూడా పటేల్ ఉతా రాష్ట్రంలో పలు కంపెనీలు ప్రారంభించారు. వీటిలో ఫ్యామిలీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు కూడా ఉన్నాయి. ఇలా నిర్విరామంగా పటేల్ రాష్ట్రంలో పలు రంగాలలో వివిధ సంస్థల అభివృద్ధికి చేసిన కృషికిగాను తాజాగా ప్రభుత్వం అతనికి ఉతా గవర్నర్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది.       

Updated Date - 2020-10-29T20:52:18+05:30 IST